14, సెప్టెంబర్ 2010, మంగళవారం

భలే భలే మంచి రోజులులే

మా స్కూలంటే నాకిష్టం (ఎవరి స్కూలంటే ఎవరికిష్టముండదులెండి). నేను నాలుగో తరగతికి వస్తూండగా మా ఈ స్కూల్లో చేరాను. పాత స్కూలు మానెయ్యడం వెనుక ఒక కథ ఉందండోయ్!

అవి నా మూడో తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు..నేను దించిన తల ఎత్తకుండా బర బరా రాస్తూ తెల్ల కాగితం రంగు మార్చడానికి ప్రయత్నిస్తున్నా.ఇంతలో నా వీపు మీద ఎవరో గోకినట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే సుబ్బలక్ష్మి దీనాతి దీనమైన మొహమేసుకుని కాస్త కూడా రంగు మారని దాని తెల్ల కాగితాన్ని చూపించి దాని కరాబు చేయడంలో నా సహాయం కోరింది. నేను ఆలోచిస్తే ప్రతి పరీక్షకు వెళ్ళే ముందు నాన్నా గారు చెప్పే మాటలు గుర్తొచ్చాయి, "నీకు తెలిసింది నువ్వు రాయి, ఒకర్ని అడక్కు, ఒకరికి చూపకు, రెండూ తప్పే!". దానితో సహాయ నిరాకరణ ప్రకటించా. అది మా ఇన్విజిలేటర్ (మా ప్రైవేట్ టీచర్ కూడా)కు పిర్యాదు చేసింది. ఆవిడ వచ్చి 'ఒకే ప్రైవేట్లో చదువుతున్నారు, ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోకపోతే ఎలా' అని నన్నే మందలించింది. నా పేపర్ తీసుకుని సుబ్బులు చేతికిచ్చింది. అది విజయగర్వంతో నా పేపర్ ముందెట్టుకుని జెరాక్స్ కంపెనీ వాళ్ళు సిగ్గుపడేలా జెరాక్స్ దించడం మొదలుపెట్టింది. ఆ అవమానానికి నా చిన్ని హృదయం బద్దలైంది. ముక్కలు తాపీగా ఏరుకుందామని అప్పటికి అక్కడ్నుంచి నిష్క్రమించి ఆ ఆవేదనంతా మా నాన్న ముందు వెళ్ళగక్కా. ఆయన అంతకన్నా ఆవేశపడి నన్ను తక్షణం స్కూలు మానిపించారు.

సరే కొత్త స్కూళ్ళ వేటలో పడి ఒకరోజు నన్ను ఒక స్కూలుకు తీసుకువెళ్ళారు.
తొలి చూపులోనే విపరీతంగా నచ్చేసింది ఆ స్కూలు. పేద్ద ఆటస్థలం, ఆటస్థలానికి ఎడంపక్క చాలా పెద్ద తోట, కుడి పక్కన వరసగా తరగతి గదులు, వెనక మామిడి చెట్టు, దానికి వేలాడుతున్న మామిడి కాయలు, ముందు వైపు ఒక స్టేజ్, దాని వెనక ప్రార్థనా మందిరం, దాని వెనక చింత చెట్టు. ఇప్పటికీ నాకు చాలా గుర్తు, ఆ రోజు కొత్త స్కూలు చూడడానికి వెళ్ళబోతున్నానని నాకు ఎంతో ఇష్టమైన తెల్ల గౌను, దాని మీద నల్ల కోటు వేసుకున్నా. నేను వెళ్ళంగానే 'ఫలానా స్కూల్లో నీకు మూడో ర్యాంకు వచ్చేదా? అబ్బో చాలా తెలివైనదానివన్నమాట ' అని వెంటనే స్కూల్లో చేర్చుకుంటారన్న నా అంచనాలని తారుమారు చేస్తూ నాకు ప్రవేశ పరీక్ష పెడతానని చెప్పారు.
జూవాలజీ, అంత్రోపాలజీ ఇలా దేన్లో అడిగినా కొద్దో గొప్పో చెప్పగలనేమో కాని లెక్కలు అందులోనూ తీసివేతలంటే నాకు చచ్చేంత భయం. చిన్న సంఖ్య నుంచీ పెద్ద సంఖ్య తీసేసేటప్పుడు పక్క సంఖ్య నుంచీ అప్పెలా తీసుకోవాలో అర్ధమయ్యేది కాదు. అసలే నాకు మొహమాటమెక్కువ, అప్పడక్కుండానే కూర్చునేదాన్ని.అలాంటిది నాకు లెక్కల్లోనే పరీక్షపెట్టారు. గుణకారాలు, భాగహారాలు, కూడికలు అన్నీ చేసేసా కాని తీసివేతలో ఎప్పట్లా తడబడ్డా. నన్ను స్కూల్లో చేర్చుకోరేమో అని భయపడ్డా. కాని మా స్కూలు మంచి స్కూలు, ఈ బంగారు కొండను చేర్చుకోకుండా ఉంటుందా? :-P

అలా మా స్కూల్లోకొచ్చి పడ్డా. ఆడుతూ పాడుతూ ఆరో తరగతికొచ్చా, అప్పట్లో మాకు ప్రతి శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ఉండేది అంటే స్కూలు పిల్లలంతా ఒక చోట సమావేశమయ్యేవాళ్ళం, చింత చెట్టు కింద. ఒక చింత చెట్టు కింద అంతమంది ఎలా కూర్చునే వాళ్ళు, అదేమైనా పుష్పక విమానమా అని సందేహమొచ్చిందా? వచ్చే ఉంటుందిలెండి, మా చింత చెట్టు అంత పెద్దది కాదు కాని మా స్కూలు పిల్లల సంఖ్య చాలా తక్కువ.

ఆ శుక్రవారపు సమావేశాల్లో విద్యార్థులంతా ఒక్కో విధంగా తమ తమ ప్రతిభలను పైకి తీసి తక్కిన విద్యార్థుల మీదకు వదులుతూ ఉంటారు. ఒక్కోసారి బాలమురళి, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి చెట్టు మీద చేరిన పిట్టల్ని బెదరగొడుతుంటే, ఇంకోసారి మైకేల్ జాక్సన్, ఎల్.విజయలక్ష్మి అక్కడ ప్రత్యక్షమౌతూ ఉంటారు. మేము సాధారణంగా చెవులకు దూదులు, కళ్ళకు గంతలు సందర్భానుసారంగా పెట్టుకుని వెళ్ళి క్లాస్ లో టీచర్ డిస్టర్బ్ చేయగా మధ్యలో ఆగిపోయిన మా చర్చలను కొనసాగించేవాళ్ళం.

ఒకనాటి సాయంకాలం అలాగే అందరం చెట్టు కింద కూర్చుని ఎప్పటిలా మామూలుగా గడ్డి పీక్కుంటూ, దేశకాలమాన పరిస్థితులను గూర్చి చర్చిస్తూ ఉన్నాం. అప్పుడు మాకు తెలియదు ఆ రోజు మేము చూడబోతున్నది ఒక మహత్తరమైన కార్యక్రమమని. 'న భూతో న భవిష్యతి ' అన్నది ఈ మధ్య అన్నిటికీ వాడేస్తున్నారు కానీ, సరిగ్గా ఆ కార్యక్రమానికి అతికినట్టు సరిపోతుంది.
ఇలాంటి సమావేశాల్లో మా విద్యార్థులంతా తమ తమ ప్రతిభలను విచ్చలవిడిగా ప్రదర్శించుకుంటారు అని చెప్పాను కదా, ఆ సాయంకాలపు వేళ మాకు చూపబోతున్న ప్రతిభ 'వ్యాపార ప్రకటనలు నటించి చూపుట '. అవాక్కయ్యారా? సినిమా వాళ్ళలాగే మా విధానం కూడా 'కాదేదీ ప్రదర్శనకనర్హం'.

ముందుగా అశ్విని హెయిర్ ఆయిల్ ప్రకటన..

'అశ్విని అశ్విని అశ్విని ...శిరోజాల సంరక్షిణి
దివి నుంచి భువికి దిగివచ్చిన అమృతవర్షిణి అశ్విని '

ఆ ప్రకటన చిన్నప్పుడు వచ్చేది..మీలో చాలా మంది చూసే ఉంటారు..

'రాలే జుట్టును అరికట్టునులే..' అన్నప్పుడు ఒకావిడ పాదాల పొడవు జుట్టేసుకుని గిర్రని బొంగరంలా తిరుగుతుంది...

ఈ ప్రకటన పూర్తయ్యేసరికి మాలో చాలా మందికి నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యింది. ఇంతకీ సంగతేంటంటే..ఈ ప్రకటనలో నటించిన నివేదితది బాబ్ కట్. అది కనపడకుండా తనకు విగ్గు పెట్టారు. గిర్రని తిరిగినపుడు ఆ విగ్ కాస్తా కింద పడింది. తన్మయత్వంలో అది గ్రహించకుండా తను 'అశ్విని..అశ్విని...' అని పాడుతూనే పోయింది.

ఆ నవ్వుల నుండి కోలుకోకముందే ఇంకో ప్రకటన మొదలయ్యింది


అది ఫెవికాల్ యాడ్, ఒక ఫెవికాల్ డబ్బా తీసుకొచ్చి స్టేజ్ మీద మాకెదురుగా పెట్టారు, మళ్ళీ ఈ ప్రకటన మరోటి, మరోటి అనుకోకుండా. ఒక దళసరిగా ఉన్న తాడును ఇటో కొసా అటో కొసా పట్టుకున్నారు కొంతమంది. ఆ తాడు తెగి లేదు కాని తెగినది ఫెవికాల్ తో అంటించారు అని చెప్పడానికన్నట్టుగా ఒక ప్రదేశం లో ఒక చిన్న ముడి వేసి ఫెవికాల్ అని రాసి ఉన్న కాగితం అంటించారు. అంతా బాగానే ఉంది కాని తాడును ఒక వైపు లాగుతున్నవాళ్ళలో 'అభినవభీమ ' గా పేరుపొందిన శివప్రసాద్ గాడు కూడా ఉన్నాడు. చిన్న వయసులోనే ఎంతో కృషి చేసి భీముడు, బకాసురుడు, ఘటోత్కచుడు స్థాయికి చేరిన వాడి గురించి అప్పటికే టి.వీలలో, వార్తాపత్రికలలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. వాడు ఒక వైపు లాగుతున్నాడనేసరికి మాకందరికీ ఆందోళన మొదలయ్యింది. అందులోనూ ఇరువైపుల సమాన బలం ఉండేలా చేయాలని నిర్వాహకులు ఒకరిద్దర్ని తప్పించి స్కూలు మొత్తాన్ని మరోవైపు నిల్చోపెట్టారు.

వాళ్ళు నటించడం మొదలుపెట్టారు..

"గట్టిగా లాగు హైస్సా
బలంగా లాగు హైస్సా
జోరుగా లాగు హైస్సా'


ఒక అరనిముషం నటించేసరికి నటన అన్న సంగతి మర్చిపోయి జీవంచడం మొదలుపెట్టాడు ప్రసాద్ గాడు. మేమేమీ తక్కువ తినలేదన్నట్టు అటు వైపు వాళ్ళు కూడా వాళ్ళ బలం కొద్దీ లాగారు. ఊహించినదే జరిగింది. తాడు సరిగ్గా కాగితం పెట్టిన చోటే తెగింది. అటు పడ్డ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు వైపు మొదట నిల్చున్నది మన బాల బకాసుర్ కదా వాడు మీద పడేసరికి వెనక నిల్చున్న నలుగురు కోమాలోకి వెళ్ళినంత పనయ్యింది. దానితో ఆ మహత్తర కార్యక్రమానికి తెర పడింది.

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

చక్రపాణి సినిమా లో ఒక చక్కని హాస్య సన్నివేశం

అసలు హాస్యం అంటే ఇలా ఉండాలి అనిపించేలా సున్నితమైన హాస్యం. నా అభిమాన నటీమణులలో ఒకరైన భానుమతి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చక్కని హాస్య సన్నివేశం చదివి, చూసి నవ్వుకోండి.
నాగేశ్వర్రావ్ భానుమతి దంపతులు వాళ్ళింట్లో ఒక భాగం అద్దెకు ఇవ్వాలనుకుని ఇంటి బయట బోర్డు పెడతారు, అది చూసి సూర్యకాంతం లోపలికి వస్తుంది. ఇదీ నేపధ్యం.

---------------------------------------------------------------
సూర్యకాంతం: మీరేనా అండీ ఈ ఇంటి యాజమానులు?
భానుమతి: ఆ, కూర్చోండి.

సూ: పర్వాలేదు, పర్వాలేదు. ఎంత మర్యాద! ఎంత మర్యాద! అయినా అంతక్కర్లేదు, సగం చాలు. మర్యాదంటే నాకు ఇష్టమే కానీ అంత అక్కర్లే, సగం చాలు, సగం!
భా: భలే వారండీ! సగంలో సగం కూడా చెయ్యందే సగం చాలంటారేమిటి?
సూ: చెయ్యకపోవడమేమిటి? వాకిలి తలుపు తీసి ఆట్టే ఉంచారు, సోఫాలు, కుర్చీలు వేసారు, రాగానే పలకరించారు, అద్దెకివ్వబడును అనే బోర్డు కొట్టారు. ఇంకా ఏం చెయ్యాలమ్మా?
భా: అద్దె బోర్డు కొట్టడం కూడా మర్యాదేనంటారా?
సూ: అసలద్దెకెవరిస్తున్నారు ఈ రోజుల్లో? ఇస్తే మాత్రం బోర్డెవరు కొడుతున్నారు? కొడితే మాత్రం అదెంతసేపుంటుంది?
భా: అదీ నిజమే! అయితే మీరా బోర్డు చూసి వచ్చారన్నమాట!
సూ: ఆ! అసలంత బోర్డక్కర్లేదు. సగం చాలు. 'అద్దెకు' అంటే చాలు, 'ఇవ్వబడును' అక్కర్లేదు. ఆ, ఇంతకీ ఏ భాగం అద్దెకిచ్చేది?
భా: ఆ భాగం.. మీ పేరు?
సూ: నా పేరా? మనోరమ.
భా: బాగుంది.
సూ: ఏం బాగుండడం లెండి! మా వారు 'మనూ, మనూ' అని పిలిచేవారు. 'రమా రమా' అని అనటం ప్రారంభించిన తర్వాత ఆట్టే కాలం ఉండలే! అసలాయన ఆయుర్దాయమే సగం.
మీ పేరు?
భా: మాలతి. నన్ను మా వారు ముద్దుగా 'మా మా! అంటూంటారు. ఇంతకీ మీరేం చేస్తూంటారు?
సూ: ఆ మాటే అడిగారూ! అబ్బబ్బబ్బ! ఎంత కష్టం! ఎంత కష్టం! పది గంటలకల్లా వెళ్ళాలి, పాఠాలు మొదలుపెట్టాలి, పిల్లల్ని అదుపులో పెట్టాలి. అబ్బబ్బబ్బ! ఏం పాఠాలు! ఏం పిల్లలు! బుర్ర చెడిపోతుందనుకోండి!
భా: ఓ పంతులమ్మ ఉద్యోగమన్నమాట!
సూ: అదే! ఇట్టే గ్రహించేశారే! ఎంత తెలివి! ఎంత తెలివి! మర్యాద, తెలివి రెండూ ఒకే బుర్రలో ఇమడడం కష్టం. ఏమంటారు?
చూడండీ! తెగించందే పనులు కావు. తెల్లారొచ్చి ఇంట్లో చేరేస్తాను.
భా: ఇల్లు చూడరూ మీరు?
సూ: మీరింత మంచివాళ్ళు, ఇంకా ఇల్లు చూడడమెందుకమ్మా? అక్కర్లేదు! అయినా నాకు కాఫీ మీద పిచ్చి పెరిగింది, వెళ్ళిపోవాలి, లేకపోతే కళ్ళు తిరుగుతాయి.
భా: ఉండండి, మీకు కాఫీ కావాలా? నేనిస్తాను, కూర్చోండి!
సూ: ఆ! మీరిస్తారా? మర్యాద తగ్గించరూ? ఎంత మర్యాద! ఎంత మర్యాద!
భా: తగ్గిస్తాను. సగమే! కూర్చోండి.

కాఫీ తేవడానికి భానుమతి లోపలికి వెళ్తుంది. ఈ లోగా నాగేశ్వర రావు వస్తాడు. వచ్చీ రావడంతోనే కాగితం తీసి

నాగేశ్వర్రావు: మీ పేరు?

సూ: ఆ! పేరా? ఆవిడ మర్యాదగా అడిగింది కనుక మనోరమ అని చెప్పాను. నీకెందుకు చెప్పాలి?

నా: మనోరమ? Beautiful! Beautiful! ఆ మీ వృత్తి?

సూ: అసలు నువ్వెవరు? నా వృత్తితో నీకేం పని? బడి పంతుళ్ళంటే అంత లోకువా?

నా: మీ వయసు?

సూ: ఆ!

నా: వయసు?

సూ: ఏం నలభై అనుకుంటున్నావా? యాభై అనుకుంటున్నావా?

నా: అబ్బే! అలా ఎందుకనుకుంటాను? పట్టుమని పదహారు కూడా ఉండవనుకుంటున్నాను.

సూ: చాల్లే! మా అక్కయ్యకే ముప్పై ఎనిమిది. దానికన్నా నేను మూడేళ్ళు చిన్న. అయినా నా వయసుతో నీకేం పని?

నా: నేను భీమా కంపెనీ ఏజంటుని, మీ ఫారం పూర్తి చేస్తున్నాను.

సూ: ఏమిటీ? భీమా కంపెనీ ఏజంటా? ఇల్లు చూడ్డానికి నేనొస్తే ఇక్కడకు కూడా తయారయ్యావూ? నేను చేయను పో!

నా: చెయ్యాలి! అలా అనకూడదు. రాసేసా. ఒక వెయ్యికి మాత్రం చెయ్యండి.

సూ: ఆ! ఎంత అమర్యాద! ఎంత అమర్యాద! ఇంత మర్యాద గల ఇంట్లో ఇంత అమర్యాదా?పోతావా లేదా?

నా: మా! మా! మా!

భా: ఏవిటేవిటి?

సూ: చూడండి, ఈయనెలా వెంటాపడ్డాడో! ఎంత అమర్యాద! ఎంత అమర్యాద!భా: అబ్బబ్బ! ఏవిటండీ మీకీ తొందర?

నా: ఆ! తొందరపడకపోతే ఎలా? దొరికిన ఈ ఒక్క కేసు కూడా వదలనా? నువ్వన్నీ ఇలాగే పాడు చేస్తావ్.

సూ: ఎవరమ్మా ఈయన?

భా: మా వారే!

సూ: చెప్పరే? అలా చనువుగా లోపలికి వస్తూంటే ఆ మాటే అనుకున్నా. మీ వారేనా? మంచివారు.

భా: హిహి, కాఫీ తీసుకోండి.
సూ: ఇంతెందుకమ్మా? సగం చాలు.

భా: సగం లో సగం కూడా లేదండీ, తీసుకోండి... ఏవండీ వీరీ భాగానికొస్తారట

నా: భాగమేవిటి, భాగం? ఇల్లంతా తీసుకుని ఒక గది మాత్రం మనకిమ్మను

భా: ఆవిడకు సగం చాలట

సూ: ఔనండీ! ఎంత మర్యాద! ఎంత మర్యాద! ఎంత మంచి దాంపత్యం!

నా: పక్క భాగంలోనే ఉంటారుగా, చూదురు గాని.

---------------------------------------------------------------

వీడియో ఇక్కడ అప్లోడ్ చేసాను, సినిమా నుంచి తెగ్గొట్టి ఈ సన్నివేశం ఒక్కటీ ఎలా అప్లోడ్ చేయాలో తెలియక కనీసం చదివి నవ్వుకుంటారని మొత్తం టైప్ చేసా తరువాత వీడియో ఎలా విడదీయాలో తెలిసింది కాని రాసింది వృధా పోవడం ఎందుకని అది కూడా పెట్టేసా.

http://www.youtube.com/watch?v=m95c3b3ZBAg

1, సెప్టెంబర్ 2010, బుధవారం

మచిలీపట్నం మాయాబజార్ - 2

చూద్దామనుకున్నవన్నీ అయిపోయాయి, ఇక పెళ్ళి మండపానికి వెళ్ళి నా స్నేహితునికి ఒకసారి మొహం చూపించి, కుదిరితే మచిలీపట్నం పెళ్ళి విందు లాగించి, వెనక్కి పోదామనుకుని వాళ్ళు పెళ్ళి మండపానికి వచ్చేసారేమోనని ఫోన్ చేస్తే అప్పట్లో వచ్చేలా లేరని తెలిసింది (ముహూర్తం తెల్లవారుఝామున మూడింటికి లెండి). సరే వాళ్ళు రాకుండా మేమెళ్ళి మాత్రం ఏం చేస్తామని చెప్పి దగ్గర్లో పరాసుపేటలో ఉన్న ఆంజనేయస్వామి వారి గుడికి చేరుకున్నాం. అక్కడ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూంటే 'ఇక్కడి ఆంజనేయస్వామి చాలా పవర్ఫుల్ అట, నీకేమైనా కోరికలుంటే కొరేస్కో' అని వెనక నుంచి మా ఆయన గుసగుసగా చెప్పారు. అసలు నాకు బాగా నవ్వొచ్చే అంశాలలో ఇదొకటి.
దేవుడు అంటేనే అత్యంత శక్తివంతుడు, సర్వాంతర్యామి, ఒకే దేవుడు వేరు వేరు స్వరూపాలు ధరించాడంతే. మరి అలాంటప్పుడు ఒక దేవుడు ఎక్కువ శక్తివంతుడు ఇంకొకరు తక్కువ ఎలా అవుతుంది? పొనీ అది కూడా ఒకే దేవుడు ఒక చోట ఎక్కువ శక్తివంతుడు ఇంకొక చోట కాస్త తక్కువ శక్తివంతుడు ఎలా? ఎంత అసంబద్దంగా ఉంది ఈ ఆలోచన! ఏంటో! పైకి అంటే ఆయనకు కోపం, నోరు మూసుకుని దణ్ణం పెట్టుకుని బయటకొచ్చేసరికి గుర్తుకువచ్చింది, పెళ్ళికి వెళ్తూ బహుమతి ఏదీ తీసుకెళ్ళట్లేదని..

ఇక చేసేదేముంది బహుమతి వేటకై బజారు మీద పడ్డాం. కనపడిన మొదటి కొట్లో దూరి, ప్రతీ వస్తువు లాగడం, దాని ధర అడగడం, బుడ్జెట్లో ఉండి, నాకు నచ్చి, మా ఆయనకు నచ్చి అంతా బాగుందనుకున్నాక దాని మీద ఏ మరకో , గీతో ఉండడం. ఇక లాభం లేదు దీని బదులు ఆ ఇచ్చేదేదో నగదు రూపంలో ఇస్తే వాళ్ళకు నచ్చేది కొనుక్కుంటారు అనుకుని తీరా కొట్టంతా లాగి, పీకి, పాకాన పెట్టాకా ఇప్పుడు ఒక గిఫ్టు కవరు కావాలంటే మామూలుగా తిట్టరని, ఆ కొట్టు యజమాని ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా అదను చూసుకుని అక్కడినుండీ బయటపడి పక్కనున్న ఫ్యాన్సీ షాపులోకి దూరాం.
ఆ దుకాణదారుడు మేము వెళ్తూనే, 'ఆ! ఏం కావాలమ్మా? కవర్ కావాలా? ఇస్తాను. ఇంకేం కావాలి? ఏమీ వద్దా? ఊరికే చూడండి పోని, చూడ్డానికి ఖరీదు లేదుగా. ఆ ఇది చూడండి కాష్మీరీ స్నో, ఇది ప్రత్యేకంగా తయారు చేసిన మందార నూనె..రెండు రోజులకొకసారి రాస్తే చాలు, జుత్తు ఊడదు, తెల్లబడదు, ఒక్కసారి వాడి చూడండి.' ఈయన ఉన్నవారు ఉన్నట్టు ఉండొచ్చు కదా తెల్లగా నిగనిగలాడుతున్న ఆయన బట్టతలను చూసి, 'మరి మీరు వాడలేదా?' అని అడిగారు. ఇహ చూసుకోండీ ఆయన మొదలుపెట్టాడు, 'నా వయసెంతనుకుంటున్నారు? చిన్నగా కనిపిస్తున్నాను కాని నాకు డబ్బై ఎనిమిదేళ్ళు, నేనిప్పటికీ చెట్లెక్కుతాను, గెంతుతాను, శుబ్బరంగా తింటాను. అసలు నేను తినగలిగినంత మీరు తినగలరా? అహ తినగలరా అని..చాలెంజ్! ఇప్పటికీ మా డాక్టరు గారు ఆశ్చర్యపడుతూ ఉంటారు, బీపీ, షుగర్ ఇన్ని పెట్టుకుని ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నానని..' ఇలా ఎక్కడా ఆపకుండా ఒక పదిహేను నిముషాలు తన వాక్ప్రవాహంలో మమ్మల్ని ముంచి, తేల్చి, ఎందుకడిగాన్రా బాబు అని మా ఆయన పశ్చాత్తాప్పడేలా చేసి కాని శాంతించలేదాయన. నాకు మాత్రం భలే ఉత్సాహంగా అనిపించింది ఆ తంతు చూస్తుంటే.

ఇంతకీ నేనా మందార నూనె కొన్నానా లేదా అనే కదా మీ సందేహం? జుత్తుకు మంచిది అంటే కిరసనాయిలు కూడా రాసేసుకునే నేను కొనకుండా ఉంటానా? రెండు రూపాయిల కవర్ కొనడానికి వెళ్ళిన మాతో రెండు వందలు ఖర్చుపెట్టించి కాని వదల్లేదాయన. అసలు పొరపాటున తెలియక రాకెట్ సింగ్ కి 'బెస్ట్ సేల్స్మన్ అఫ్ ది ఇయర్' ఇచ్చేసారు కాని ఈయనకు ఇవ్వాల్సింది.

ఇక ఆ రోజు పెళ్ళికెళ్ళి కాసేపు కూర్చుని వెనక్కి వెళ్ళిపోయాం. వచ్చేస్తూంటే గుర్తొచ్చింది తాతారావు కొట్లో బందరు హల్వా తీసుకోవడం మర్చిపోయామన్న సంగతి :-( మరుసటి రోజు పుస్తకాలు కొనడానికి బెజవాడ వెళ్ళి ముందుగా తయారు చేసుకున్న లిస్టు ప్రకారం 'విశాలాంధ్ర బుక్ హౌస్ ' లో అన్నీ పుస్తకాలు కొని బయల్దేరాం. దారిలో ఉయ్యూరులో బస్ ఆగినపుడు, 'పాప్ కారం, పాప్ కారం' అంటూ పాప్ కార్న్ అమ్ముతున్న కుర్రాడిని చూస్తే భలే ముచ్చటేసింది. ఇక్కడ మనం యధాశక్తి ఇంగ్లీషుని తెలుగు మాటల్లోకి లాగడానికి ప్రయత్నిస్తూంటే అక్కడా పిల్లాడు చక్కగా పాప్ కార్న్ ని కూడా తెనుగీకరిస్తున్నాడు.


యాత్రంతా బాగానే అయ్యింది కాని వచ్చేసేముందు తాతగారు, నేనెంతో ముచ్చటపడి కొనుక్కున్న భానుమతి గారి "నాలో నేను" పుస్తకం చూపిస్తూ, 'అమ్మాయ్! ఆ పుస్తకం అలా ఉంచేసి వెళ్ళు, మరొకసారి వచ్చినప్పుడు తీసుకొస్తా లే' అనేసరికి నా మొహానికి గంటు పడిపోయింది. ఆస్తి రాసిచ్చెయ్యమన్నా (మనకేముంది కనుక) నవ్వుతూ ఇచ్చెయ్యగలను కాని , పుస్తకాలో, పాత సినిమా సీడీలో ఎవరైనా అడిగితే మాత్రం తెగ బాధేసేస్తుంది. వెనుక నుంచి 'మంచి పనయ్యింది ' అని చంకలు గుద్దుకుంటున్న మా వారిని చూస్తే ఎక్కడలేని కోపం వచ్చేసి నాలుగు మొత్తబుద్దేసింది.

నేను కొన్న పుస్తకాలు



నాగేస్రావ్ గారి కోరిక మేరకు నా దగ్గరున్న మరొక రెండు ఫోటోలు... సాయి బాబా విగ్రహం, పార్కు


31, ఆగస్టు 2010, మంగళవారం

మచిలీపట్నం మాయాబజార్ - 1

నేను గత వారం ఒక పెళ్ళి నిమిత్తమై మచిలిపట్నం వెళ్ళాను. ఆ ప్రయాణపు విశేషాలు ఇలా..

ఏవో కొన్ని పుస్తకాలు కొందామని ఎప్పట్నుంచో బెజవాడ వెళ్ళాలనుకుంటున్నా కాని కుదరలేదు. ఇంతలో స్నేహితుడొకడు వచ్చి వాళ్ళ అన్నయ్య పెళ్ళి కుదిరిందని, పెళ్ళి మచిలీపట్నంలోనని, తప్పక రావలసిందని చెప్పాడు. సరే, దెబ్బకు మూడు పిట్టలు. ఈ పెళ్ళి నెపంతో బెజవాడ వెళ్ళి కావలసిన పుస్తకాలు కొనుక్కోవచ్చు, మా నాన్నగారి ఊరైన మచిలీపట్నం చూసే అవకాశం ఇంత వరకు కలగలేదు, అది చూసి రావొచ్చు, పనిలోపని పెళ్ళి పని కూడా చూసుకోవచ్చని చెప్పి నేను మా ఆయన బెజవాడ ప్రయాణమయ్యాం.

పొద్దున్న తొమ్మిదింటికి బెజవాడలో దిగి గవర్నరుపేటలో ఒక మాంచి పెసరట్టు లాగించి, మా ఆయన తాతగారి ఊరైన పామర్రుకు బయల్దేరాం. మేము ఇల్లు చేరేసరికి పన్నెండు కొట్టింది. గబ గబా స్నానాలు కానిచ్చి భోజనాల ముందు కూర్చున్నాం. అన్ని పదార్ధాలతో ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో! దోసకాయ పప్పు, కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర, అల్లం పచ్చడి, ముక్కల పులుసు, గారెలు, గడ్డ పెరుగు. ఎప్పుడూ హడావిడిగా ఇంటికి రావడం, ఏదో ఒక కూరో, పప్పో చేసుకుని, ఇంటి నుండి తెచ్చుకున్న ఆవకాయతో భోజనం అయిందనిపించడం..ఇదేగా మనలో చాలా మంది రోజూ చేసే పని. అలాంటిది అన్ని పదార్ధాలు కొసరి కొసరి వడ్డిస్తుంటే పొట్ట చాలు ఇక మోయలేనంటున్నా, మనసు మాత్రం మరి కాస్త లాగించమంటోంది. అమ్మమ్మ చేతికి అడ్డూ, అదుపు లేక, కలిపిన ప్రతీ ముద్దపై ఆవిడ చేతుల్లోంచి నెయ్యి ధారపాతంగా పడుతూ ఉంటే ఆ కమ్మదనానికి తినగలిగిన దాని కంటే మరి కాస్త లోపలికి తోసి అలా చేయి కడుగుతూనే నిద్రా దేవి ఒళ్ళోకి మత్తుగా జారుకున్నాం.

సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో మచిలీపట్నానికి బయల్దేరాం. ఆ రోజు రాత్రే పెళ్ళి. బందరులో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ తిప్పి పెళ్ళి వేదికకు చేర్చేటట్టు ఒక ఇస్పెషల్ ఆటో మాట్లాడుకున్నాం. పామర్రు నుంచీ బందరుకు వెళ్ళే దారంతా పచ్చని పంట పొలాలే! ఎటు చూసినా పచ్చదనమే! పచ్చని పొలాలు, ఆ పొలాల పక్కగా పారే కాలువలు..ఆహా! ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో! అందులోనూ పుట్టి బుద్దెరిగిన తర్వాత నేనెప్పుడూ పల్లెలకు వెళ్ళినదాన్ని కాను. ఆ పొలాల మీదుగా వచ్చే పైరగాలి పీలుస్తూ, ఆ పచ్చదనాన్ని కళ్ళతోనే జుర్రుకుంటూ ఉంటే ఎంతైన పల్లెవాసులు భలే అదృష్టవంతులు అనిపించక మానదు. అలా వెళ్తూ మన అన్నగారి ఊరైన నిమ్మకూరు దాటుకుని మచిలీపట్నంలో అడుగుపెట్టాం.

ముందుగా అక్కడి సాయిబాబా గుడి, మున్సిపల్ పార్కు, చిలకలపూడి పాండురంగస్వామి గుడి చూసుకుని తర్వాత పెళ్ళి మండపానికి వెళ్ళాలనేది మా ఆలోచన. అసలు ఈ ప్రయాణంలో విజయనగరం నుండీ అమ్మా నాన్నా కూడా వచ్చి కలవాలి ప్రణాళిక ప్రకారం. కాని అమ్మకు కాస్త ఒంట్లో బాగాలేకపోవడంతో వాళ్ళు విరమించుకున్నారు. లేకపోతే నాన్నా వాళ్ళు అప్పుడున్న ఇల్లు, చదువుకున్న కాలేజి అన్నీ చూద్దాం, అన్నిటికీ మించి వాళ్ళ ఊరి గురించి చెప్తూంటే నాన్న కళ్ళాల్లో మెరుపు చూద్దామని నాకెంతో ఆశ. సరే ముందుగా సాయిబాబా గుడికి వెళ్ళాం. అక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన సాయి బాబా విగ్రహం ఉంది (54 అడుగుల ఎత్తు). ఆదిశేషుని పడగల నీడలో కాలు మీద కాలు వేసుకుని కూచున్న ఆ విగ్రహం చాలా బాగుంది.




అక్కడి నుంచీ బయలుదేరి మున్సిపల్ పార్కు చేరుకున్నాం. పార్కు చాలా పొందిగ్గా ఉంది, కృష్ణుని విగ్రహం, శివపార్వతుల విగ్రహాలు అక్కడక్కడా ఉన్నాయి. అక్కడ ఉన్న చాలా బల్లల మీద ఎక్కువగా పెద్దవాళ్ళే కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. నాకు లేని కారణం చేతో మరెందువల్లో నాకు చిన్నప్పట్నుంచీ తాతాగార్లంటే చాలా ఇష్టం, అందులోను 'ఆనందో బ్రహ్మ ' లో సోమయాజికి ఉన్న తాత లాంటి తాత నాకు కూడా కావాలని కోరిక. వాళ్ళతో కబుర్లు చెప్పాలని, వాళ్ళ మాటల్లో జ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవాలని ఎంతో ఆశ. ఎటు చూసినా తాతగార్లే ఉన్న ఆ పార్కును విడిచి రాబుద్దే కాలేదు.





బయటకొచ్చేసరికి వడిసెల (catapult or sling) అమ్ముతూ ఒక చిన్న పిల్ల కనిపించింది. 'తీసుకో అక్కా, తీసుకో అక్కా' అంటూ వెంటపడింది. మామూలుగా ఐతే దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియని నేను కచ్చితంగా తీసుకోకపోదును కాని 'ఆంటీ ' అని కాక 'అక్కా' అని పిలిచినందుకు మురిసిపోయి కొనేసా. ఇక్కడ బెంగుళూరులో రెలయెన్స్ ఫ్రెష్ కి వెళ్ళిన ప్రతీ సారి అక్కడ పూలు అమ్మే పిల్లలు 'పూలు తీసుకో ఆంటీ' అని అడుగుతూనే ఉంటారు. చక్కగా మాల కట్టి ఉన్న విరజాజులను చూసి మనసు ఎంత లాగినా నన్ను ఆంటీ అని పిలుస్తారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోను.

అక్కడినుండి బయలుదేరి పాండురంగస్వామి గుడికెళ్ళాము. నాకు మామూలుగానే కృష్ణుడంటే ఇష్టం, అందులోనూ ఇస్కాన్ వారి పద్దతిలో ఉన్న కృష్ణుడిలా కాక పాండురంగడిలా , రంగనాథునిలా ఉన్న కృష్ణుడు మరీ ఇష్టం. అక్కడి పాండురంగడ్ని చూడ్డానికి నిజంగా రెండు కళ్ళు చాలనే లేదు. అక్కడి పూజారి, మామూలు గుడుల్లో పుజారుల్లా 'అసింట, అసింట ' అనకుండా, నేను కాస్త దూరంగా నిల్చుంటే 'దగ్గరకొచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టుకోమ్మా' అని చెప్పారు. అలా దగ్గరకెళ్ళి గులాబి పూలతో అలంకరింపబడ్డ ఆ పాండురంగడి రూపాన్ని కళ్ళలోనే నిలుపుకుందామని అలాగే చూస్తూ ఉండిపోయా. గుడికి వచ్చిన మరొక ఆవిడ నా తన్మయత్వాన్ని చూసి, 'మీది ఈ ఊరు కానట్టుందే! గులాబి పూల అలంకరణతో స్వామి బాగున్నాడు కదా, నిన్న చామంతి పూలతో అలంకరించారు ' అంటూ పలకరించారు. నాకు చిన్న ఊర్లలో నచ్చేది ఇదే. ఎవరికీ మాట్లాడుకోవడానికి 'ఫార్మల్ ఇంట్రడక్షన్ ' అవసరం ఉండదు. చక్కగా నోరు విప్పి, మనసు విప్పి మాట్లాడేస్తారు. మా ఆఫీసు బస్సులో సంవత్సరం నుండీ వెళ్తున్నా నాకు ఒక్కరి పేరు తెలియదు, నేను ఎవర్నీ పలకరించిన పాపాన పోలేదు, నన్ను ఎవరూ పలకరించిన పాపాన పోలేదు.


విశాలమైన స్థలంలో కట్టబడిన ఆ ప్రాంగణంలోనే రాధా దేవి, రుక్మిణీ దేవి, సత్యభామా దేవి, దుర్గా దేవి ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి, వెనక ఒక కోనేరు కూడా ఉంది. అసలక్కడ కూర్చుంటే ఎన్ని సాయంత్రాలైన ఇట్టే గడిచిపోతాయనిపించింది.

టపా అనుకున్నదాని కన్నా పెద్దదయిపోయింది. దీన్ని రెండో భాగంలో కొనసాగిస్తానేం?

24, ఆగస్టు 2010, మంగళవారం

రాఖీ పండగ జ్ఞాపకాలు

అన్నాదమ్ములున్న ప్రతి అమ్మాయికి ఇష్టమైన పండగ ఈ రాఖీ పండగ. రాఖీ సందర్భంగా పండగ జ్ఞాపకాలు కొన్ని ఇలా..

ఊహ తెలిసిన తర్వాత జరుపుకున్న మొదటి రాఖీ పండగకు ఎంత బాధపడ్డానో! అన్నయ్యకే అందరూ రాఖీలు కడుతున్నారని. పిన్ని కూతుళ్ళు వాళ్ళూ వచ్చి అన్నయ్యకే కట్టారు. పోని అమ్మ నాకొకటి కొంది అని సంతోషపడితే అదీ తీసుకెళ్ళి అన్నయ్యకే కట్టమంది. 'నాకు ఎవరూ రాఖీ కట్టట్లేదు. అందరికీ అన్నయ్యంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు' అని అమ్మతో చెప్పి ఏడ్చా కూడా. పెద్దౌతున్న కొద్దీ రాఖీ కట్టించుకోవడంలో కంటే కట్టడంలోనే ఎన్నో ఉపయోగాలున్నాయని జ్ఞానోదయమయ్యింది. తర్వాతి పండగకి ఎంతో జాగ్రత్తగా దాచుకున్న రూపాయి పెట్టి రాఖీ కొని అన్నయ్యకు కడితే, అన్నయ్య అర్ధరూపాయి ఇచ్చాడు. నేను ఏడుపు మొహం పెట్టుకుని నాన్న దగ్గరకెళ్ళి 'నాన్నా చూడండి, నేను రూపాయి రాఖి కడితే అన్నయ్య అర్ధ రూపాయి ఇచ్చాడు, ఇంకో అర్ధ రూపాయైనా ఇప్పించండి ' అని నాన్నతో అన్నా. అలా డబ్బులు ఇవ్వమని అడక్కూడదు, అన్నయ్య ప్రేమతో ఎంతిస్తే అంత తీసుకోవాలి అని నాన్నంటే, నాన్నకు కూడా అన్నయ్యంటేనే ఇష్టం అనుకున్నా.

కాలం గిర్రని తిరిగి మళ్ళీ రాఖీ పండగొచ్చింది. సరిగ్గా నాకోసమే అన్నట్టు పండగ సమయానికి మా దొడ్డమ్మ గారబ్బాయి మూర్తన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు. క్రితం సారి రాఖీ కి జరిగిన నష్టం ఈ సారి పూడ్చుకోవాలని షాపుకెళ్ళి రెండు రాఖీలు తెచ్చుకుని, ఎంతైనా సొంతన్నయ్య కదా అని ముందుగా తీసుకెళ్ళి అన్నయ్యకి కట్టేసా. ప్చ్! ఏం లాభం లేదు. ఎప్పటిలాగా అర్ధ రూపాయే ఇచ్చాడు. ఛీ! అన్నయ్యకు కట్టడం వేస్ట్. కట్టకపోయినా నా రూపాయి నాకు మిగిలేది అని విచారపడుతూ మూర్తన్నయ్యకు రాఖీ కట్టడానికెళ్ళా. మూర్తన్నయ్య ఎంత మంచాడో! నేను కడుతూనే రెండు రూపాయల నోటు తీసి ఇచ్చాడు. మొహంలో ఎంత దాద్దామనుకున్నా దాగని సంతోషం. కాని ఠక్కని తీసేసుకుంటే బాగుండదని మొహమాటంగా 'వద్దన్నయ్యా, వద్దు' అని బయటకు అంటున్నానే కాని 'వద్దా సరే' అని తిరిగి జేబులో ఎక్కడ పెట్టేసుకుంటాడో అని లోపల ఒకటే భయం. కాని పాపం అన్నయ్య 'తీసుకోమ్మా తీసుకో' అని బలవంతంగా (?) నా చేతిలో పెట్టేసాడు. ఇక చూసుకోండి నా సంబరం. టట్టడాయ్ అనుకుంటూ నా రెండు రూపాయల నోటు అన్నయ్య ముందు కాసేపు ప్రదర్శనకు పెట్టి, ఆ తర్వాత ఆ నోటు ముందు పెట్టుకుని రంగుల కలలెన్నో కంటూ గడిపేసా.

మరుసటి ఏడాది నుంచీ నా రాఖీల సంఖ్య పెంచేసా. మా ఇంటి ఎదురుగా ఉండే ఇద్దరబ్బాయిలకీ కట్టేసా. అప్పటికి రూపాయి ధర బాగా పడిపోయింది. అన్నయ్య పాపం సంవత్సరం అంతా దాచి దాచి, ఐదు రూపాయలిచ్చాడు కాని ఎదురింటబ్బాయిలు ఇచ్చిన పది రూపాయల ముందు అన్నయ్య ఐదు రూపాయలు తేలిపోయాయి. అప్పటినుండి నా రాఖీల దెబ్బకు వీధిలోని అబ్బాయిలంతా బలైపోయారు. ఇలా పదవతరగతి వరకు నా రాఖీ యాత్ర అప్రతిహతంగా కొనసాగింది. జూనియర్ కాలేజీకి వచ్చాకా, పండగ రోజు రాఖీ కడదామని ఓ ఇరవై రాఖీలేసుకుని కాలేజీకి వెళ్ళానా? ఆ రోజు ఒక్క అబ్బాయి కాలేజీలో కనపడితే ఒట్టు. బొత్తిగా అబ్బాయిలకు క్రీడాస్పూర్తి లేకుండా పోయింది. ఇంజినీరింగ్లో ఉండగా మాకు ఎంతో సాయం చేసిన సీనియర్లకి వాళ్ళ హాస్టల్ కి వెళ్ళి మరీ రాఖీ కట్టాను. ఏంటో! వాళ్ళు ఆ రోజు నుండీ కనపడడం మానేసారు :-(

కొసమెరుపేంటంటే, ఉద్యోగంలో చేరిన కొత్తల్లో రాఖీ పండగ మరో నాలుగు రోజుల్లో ఉందనగా, 'ఏయ్! మంచి మంచి పాత పాటలన్నీ కాపీ చేసి ఒక ఫొల్డర్లో పెట్టి ఉంచు' అన్నాడు, తన అవసరమైనా, పక్క వారి అవసరమైనా గదమాయించడమే కానీ సౌమ్యంగా అడగడం చేతకాని మా బుజ్జన్నయ్య. ఎందుకనడిగితే 'ఎందుకైతే నీకెందుకు, చెప్పింది చెయ్యి, మంచివి ఎక్కించు, అసలే తనకి నీలాగ పాత పాటలంటే పిచ్చి' అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు ఒళ్ళు మండింది. 'నాకోసమంటే ఒక్క చిన్న పని చేసిపెట్టడు, అదే ఎవరికో ఐతే సి.డి. రాసిపెడుతున్నాడు ' అని ఆ ఉడుకుమోత్తనంతో మంచి పాటలు కాకుండా నాకంతగా నచ్చని, బాగాలేని పాటలన్నీ కాపీ చేసి పెట్టేసా. నాకేం తెలుసు ఆ పాటలన్నీ కాపి చేసిన ఎమ్పీత్రీ ప్లేయర్ నాకు రాఖీ రోజు బహుమతిగా ఇస్తాడని!! :-( :-(

15, ఆగస్టు 2010, ఆదివారం

స్వాతంత్రదినోత్సవం - మన బాధ్యత

ఈ రోజు స్వాతంత్ర దినోత్సవానికి ఒక సెలవు దినంగా తప్ప పెద్ద ప్రాముఖ్యత లేకుండా పోయింది, ముఖ్యంగా ఈ కాలం పిల్లలకు. నిజానికి మనం జరుపుకునే పండగలన్నిటిలోనూ అగ్రస్థానం ఆక్రమించగల అర్హత ఉన్న పండగ ఇది. మన ముందు తరానికి తెలిసినంతగా స్వాతంత్రం విలువ, స్వాతంత్రదినోత్సవం గొప్పదనం ఈ తరానికి తెలియదేమో!

ఆగస్టు పదిహేను అనంగానే నాకు మా అత్తే గుర్తుకువస్తుంది. మా అత్త జీవితంలో మూడే పండగలు. అవి ప్రాధాన్యక్రమంలో
1. స్వాతంత్ర దినోత్సవం
2. గాంధీ జయంతి
3. రమణ మహర్షి పుట్టినరోజు

స్కూల్లో జండా వందనం కాగానే అత్త దగ్గరకు పరిగెత్తేవాళ్ళం, రోజు అత్త చేసే మిఠాయిలు తినడానికి. అప్పట్లోచొక్కాలకు పెట్టుకునేందుకు చిన్న పరిమాణంలో గుడ్డతో చేసిన జెండాలు అమ్మేవారు. ఇప్పుడు కూడా అలాంటివి అమ్ముతున్నారనుకుంటా. మేము అత్త దగ్గరకు వెళ్ళంగానే మా చొక్కాలకు జండాలు ఉన్నాయో లేవో చూసి లేకపోతేకొనుక్కురమ్మని డబ్బిచ్చి పంపేది. జండా పెట్టుకుని వచ్చేదాకా వేరే మాట మాట్లాడనిచ్చేది కాదు. తర్వాత స్వాతంత్రంఅంటే ఏంటో, అది సాధించడానికి మన వాళ్ళు పడ్డ కష్టలేంటో వివరించి చెప్పి, మేము శ్రద్దగా విన్నామో లేదో ప్రశ్నలేసినిర్ధారించుకుని మరీ మిఠాయి పెట్టేది. ఆవిడకు గాంధి గారంటే ఎంత అభిమానమో! 'గాంధీ గారు చనిపోయిన రోజురేడియోలో ఆయన మరణవార్త విని ఎవరో ఇంట్లో వాళ్ళు పోయినంతగా మేమంతా ఎంత బాధపడ్డామో, రోజు ఇంట్లోపొయ్యే వెలిగించలేదు, ఇంట్లో అన్నమాటేంటి, దేశంలోనే ఎవరూ వెలిగించి ఉండరు ' అని గద్గద స్వరంతో ఆవిడ చెప్తుంటేనరనరాల్లోకి దేశభక్తిని ఇంజెక్ట్ చేసినట్టే ఉండేది.

'ఏం చేసినా చెయ్యకపోయినా రోజు జండా వందనానికి హాజరయ్యి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని,జనగణమణ పాడుకోవడం మన కనీస విధి, అంటే నానా అడ్డమైన పనులూ చేసేసి జనగణమణ పాడెయ్యమని కాదు,మంచిగా ఉంటూ మనకు వీలైనంతలో పక్కవాడికి సాయం చేస్తూనే మనమిలా స్వతంత్రంగా ఉండడానికి అవకాశం కల్పించిన మహానుభావుల గురించి తల్చుకోవాలి ' అని చెప్పేది.

ఇప్పటి పిల్లలకు బాల గంగాధర్ తిలక్ ఎవరో తెలియదు, లాలా లజపతి రాయ్ ఎవరో తెలియదు, అదే రాం చరణ్ తేజ గురించో, అరుంధతి సినిమా గురించో అడిగితే ఠక్కున చెప్తారు. ఇది మనం నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. తల్లిదండ్రులందరూ ఈ విషయంలో బాధ్యత తీసుకుని పిల్లలకు మన స్వాతంత్ర సమరయోధుల గురించి చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పి వాళ్ళ మనసుల్లో నాటుకుంటునేలా చెయ్యాలి. తద్వారా వాళ్ళను తలుచుకున్నవారౌతాము, అలాగే మన పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా అది తోడ్పడుతుంది.

లాల్ బహుదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రి గా పని చేసే రోజుల్లో తమిళనాడు లో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసారు. అది ఆయనకు వృత్తి పట్ల ఉన్న బాధ్యత. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ గారు కోర్టులో కేసు వాదిస్తూ ఉండగా భార్య చనిపోయిందని టెలిగ్రాం వస్తే చదువుకుని జేబులో పెట్టుకుని వాదన పూర్తి చేసారు. అది ఆయనకు వృత్తి పట్ల ఉన్న నిబద్దత, అది ఆయన గుండె నిబ్బరం. అందుకే ఆయన ఉక్కు మనిషి అయ్యారు. మన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్యముంటే తుపాకి పేల్చమని తెల్లవారికి గుండె చూపించారు. అది ఆయన ధైర్యం. ఇలా ఎన్నో స్పూర్తిదాయకమైన సంఘటనలున్నాయి మన దేశభక్తుల జీవితాల్లో. ఇవి మనందరికీ తెల్సిన విషయాలే. కాస్త శ్రద్ద చూపించి పిల్లలకు స్పూర్తి కలిగించేలా ఆ మహనీయుల జీవితాల్లోంచి విశెషాలు చెప్పే బాధ్యత సంతోషంగా తీసుకుందాం.

జైహింద్!

స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

చిన్నప్పుడు మనమంతా పాడుకున్న ఈ పాట అంతర్జాలంలో ఎక్కడ వెతికినా దొరకలేదు. బ్లాగ్మిత్రులందరికీ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

కాకమ్మా చిలకమ్మా కథలే మాకొద్దు
మా గాంధి చెప్పిందే మాకెంతో ముద్దు

నెహ్రూజీ ఏమన్నారు?
శాంతి శాంతి అన్నారు
నేతాజీ ఏమన్నారు?
జైహింద్ జైహింద్ అన్నారు
లాల్ బహుద్దుర్ వీర బహుద్దుర్ ఏమని అన్నారు?
జై జవాన్ జై కిసాన్ అన్నారు, పదమన్నారు

లల్లలల్లలా లల్లలల్లలా లల్లలల్లలల్లలల్లలా

పిల్లలకే ఇక రాజ్యం ఇస్తే
ఎల్లలు కల్లలు చెరిపేస్తాం
అల్లరి మూకల ఆటలు కట్టి
తెల్లని పావురమెగరేస్తాం
సింహానికీ జింక పిల్లకు
స్నేహం కలిపి మెప్పిస్తాం

లల్లలల్లలా లల్లలల్లలా లల్లలల్లలల్లలల్లలా

10, ఆగస్టు 2010, మంగళవారం

కిరాణా/బడ్డీ కొట్టు - చిరుతిండి మహోత్సవం

కిరాణా కొట్టు మీద రాసేది ఏముంటుందనుకుంటున్నారా? అబ్బో! చాలానే ఉంటుందండీ! ఇప్పుడైతే సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు రాజ్యమేలుతున్నాయి కాని చిన్నతనంలో వీధిలో ఉండే బడ్డీ కొట్టే మెగా స్టోరు, సూపర్ స్టోరూను. వైశాల్యంలో కాని, ఆకర్షణలో కాని మరెందులోనూ సూపర్ మార్కెట్లతో పోటి పడలేని చిన్న కిరాణా కొట్లలో దొరకని వస్తువే ఉండదు. ఏమడిగినా ఏదో ఒక మూల నుంచి ఇట్టే తీసివ్వడం చూస్తే అది కిరాణా కొట్టా కల్పవృక్షమా అని సందేహం కలగకమానదు.

చిన్నప్పుడు ఏ చింతపండో, బంగాళా దుంపలో తేవడానికి అమ్మ వీధి చివర కిరాణాకొట్టుకు పంపడంతో మొదలయ్యింది కిరాణాకొట్ల మీద నాకు ప్రేమ. ఎక్కడికెళ్ళినా జంటకవుల్లా అన్నయ్యా నేను కలిసే వెళ్ళే వాళ్ళం. కొట్లో సరుకులు కొన్న ప్రతీ సారీ ఏదో ఒకటి 'కొసరు ' అడిగి తీసుకోవడం మా ఆనవాయితీ. అది బెల్లం ముక్కో, పటిక బెల్లమో, బోడిశెనగ పప్పో ఏదైనా కావొచ్చు. అవి ఇంట్లో దొరకవని కాదు కొట్లో అడిగి సాధిస్తే అదో సంబరం.

ఇంకాస్త పెద్దయ్యేసరికి మేము అప్పట్లో ఉండే ఇంటికి నాలుగంగల దూరంలో రెండు బడ్డీ కొట్లు ఉండేవి. నా స్నేహితుని నాన్న గారు అక్కడుండే జంట కొట్లలో ఒకదాని యజమాని. మేము ఆ అబ్బాయిని చూసి ఎంతగా కుళ్ళుకునేవాళ్ళమో! ఎంచగ్గా తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ నాన్ననడిగి చాక్లేటో బిస్కట్టో గుటుక్కుమనిపించచ్చు. ఒక్కోసారి ఆయన ఆ అబ్బాయిని కొట్లో కూర్చోపెట్టి భోజనానికి వెళ్ళేవారు. ఆహా! అప్పుడైతే మాకు వాడి స్థానంలో పరకాయ ప్రవేశం చేయగలిగితే ఎంత బాగుణ్ణో అనిపించేది. పెద్దయ్యాక ఎలా అయినా ఒక బడ్డీ కొట్టుకి యజమాని కావడమే నా జీవితాశయమని అప్పుడే గట్టిగా నిర్ణయించేసుకున్నా.

ఆ జంట కొట్లలో రెండో దానిలో ఐతే మరీనూ మనకు కావలసిన, నోరూరించే సామాన్లు చాలానే ఉండేవి. నిమ్మ తొనలు,నాన్ కతాలు,కప్పు కేకులు, రెండు వైపులా జాము రాసి పెట్టి అమ్మే బన్నులు, చేగోడీలు ఇలా ఎన్నెన్నో! ఎప్పుడైనా నాన్నతో కొట్టుకు వెళ్ళినప్పుడు ఏదైనా కొనమంటే కొనేవారు కాని ఇవన్నీ మాయాబజార్ లో ఘటోత్కచుడిలా ముందేసుకుని ఒకదాని తర్వాత ఒకటి తినగలిగితే ఎంత బాగుంటుందో కదా అనిపించేది. మంచి ముహూర్తం చూసుకుని ఈ మహత్తరమైన ఆలోచనను అమలులో పెడదామని అన్నయ్యకు చెప్తే ఆ ఊహకే లాలాజలం ఊరి ఆ ప్రాజెక్టులో పాల్గొనడానికి సరేనన్నాడు.

సరే ఇద్దరే ఐతే ఈ బృహత్తర కార్యక్రమానికి నిధులు సేకరించడం కష్టం కనుక మా పక్కింటి శ్రీలతను కూడా జట్టులో కలుపుకున్నాం. ఇలాంటి చిరుతిండి మహోత్సవంలో ఇంకొకరికి భాగం పంచడం అర్ధ సింహాసనం పంచడమంతటి త్యాగమే ఐనా ఉత్సవం జరపడానికి కావలసిన ముడిసరుకు లత నుంచి వచ్చే అవకాశమే ఎక్కువ (ఎందుకంటే లతకు బామ్మ ఉంది, మాకు లేదు) కనుక తప్పలేదు. ఇహ మొదలయ్యింది మా డబ్బు సంపాదన పర్వం. లత వాళ్ళ బామ్మ దగ్గరకెళ్ళి దెబ్బ తగిలిందనో, అమ్మ కొట్టిందనో కొళాయి విప్పితే ట్రిప్పుకొక పావలా నుంచి అర్ధ వరకు రాలేవి. అమ్మ సామాన్లకని కొట్టుకు పంపితే అక్కడ కొద్దిగా చిల్లర మిగిలితే, అమ్మ మంచి మూడ్లో ఉంటే, ఆ చిల్లర మా జేబుల్లో చేరేది. ఇంక నాన్న హుషారుగా ఉన్నప్పుడు యూనిట్ టెస్టు మార్కులు చూపించి ఒక అర్ధ రూపాయి దాకా రాబట్టేవాళ్ళం. ఈ తరహా సంపాదన మటుకు నాకొక్కదానికే. అన్నయ్య మార్కులు చూపితే తన్నులే తప్ప డబ్బులు రాలే ప్రసక్తే లేదు. ఇలా ఒక రెండు నెలలు పైగా కష్టపడి పైసా పైసా దాచి ఒక పది రూపాయల దాక కూడబెట్టినట్టు గుర్తు.

ఇంక కూడపెట్టినది చాలని చిరు తిండి మహోత్సవం జరపడానికి సిద్దమయిపోయాము. ఒక ఆదివారం సాయంత్రం ముగ్గురం బయల్దేరి కొట్టుకి వెళ్ళి నాన్ కతాలు , నిమ్మ తొనలు, 15 పై చాక్లెట్లు, కేకులు, సందు చివర బండీ వాడి దగ్గర రెండు రూపాయల పకోడీలు తీసుకున్నాం. గోళీ సోడా అని ముందుగా అనుకున్నా బడ్జెట్ అనుమతించడంతో ఒక చెంబు తీసుకెళ్ళి రెండు రూపాయల ద్రాక్ష షర్బత్ తెచ్చుకున్నాం. ఇవన్నీ లత వాళ్ళ పెరట్లోకి తీసుకెళ్ళి అన్నీ ముందు పెట్టుకుని 'వివాహ భోజనంబు ఇంపైన వంటకంబు..' అని పాడుకుంటూ తింటూంటే కదా స్వర్గానికి ఒక మెట్టు దూరానికి వెళ్ళిపోయామంటే నమ్మండి.



4, ఆగస్టు 2010, బుధవారం

మామిడి తాండ్ర - భీషణ ప్రతిజ్ఞ

ఆ వేసవి మధ్యాహ్నం నేను, మా అన్నయ్య డాబా మెట్ల మీద కూర్చుని ఉన్నాం. మా ఎదురుంగా నోరూరించే నూజివీడు రసాలు నాలుగు. మా ఇద్దరి మొహాలు ఎర్రగా ఉన్నాయి. అవి పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న మా మనస్సులను ప్రతిబింబిస్తున్నాయి. దానికి కారణం క్రితం రోజు సాయంత్రం డాబా మీద మాకు జరిగిన అవమానమే..
ఓ పద్దెనిమిది గంటలు వెనక్కి వెళ్తే..


సెలవులకని మా పక్కింటి బుజ్జి గాడింటికి వాళ్ళ బాబాయి వాళ్ళు ఏల రావలె?
వచ్చితిరిపో ఉత్త చేతులతో రాక మామిడి తాండ్రను ఏల తేవలె?
తెచ్చితిరిపో వాడు డాబా పైకి వచ్చి మేము చూస్తుండగా, మాకు పెట్టకుండా ఏల తినవలె?
తినెనుపో మమ్మల్ని చూసి ఊరూరుట్ట అని ఏల అనవలె?


అహో ఇది భరించలేని అవమానం, అది తట్టుకోలేని మా చిన్ని హృదయాలు ఏ నిముషంలో ఐనా బద్దలయ్యే అగ్ని పర్వతాల్లా కుతకుతమంటున్నాయి..అప్పుడే ప్రతిజ్ఞ చేసుకున్నాము..ఎలా ఐనా మామిడి తాండ్రను తయారు చేసి, బుజ్జి గాడి తాండ్ర అయిపోయే దాకా ఆగి, అప్పుడు మా తాండ్రను తీసి వాడ్ని ఊరిస్తూ తినాలని..

ఆ రోజు రాత్రి నూటముప్పయ్యోసారి నాన్నగారికి మరుసటిరోజు పొద్దున్న మామిడిపండ్లు తేవాలని గుర్తు చేసి పడుకున్నాం. ఆ రాత్రంతా తాండ్రను గురించిన కలలే!! మేము కష్టపడి చేసిన తాండ్రను బుజ్జిగాడు దొంగతనంగా తినేసినట్టు నాకు కల వస్తే, వాడి తాండ్రను మేము దొంగలించి తెచ్చినట్టు అన్నయ్యకు కల వచ్చింది. పొద్దున్న కోడి కూయక ముందే నిద్ర లేచి నాన్నగారిని లేపి అప్పటికి బజారు తెరవరని ఆయన చెబుతున్నా వినకుండా సంచీ చేతికిచ్చి ఆయన్ను పంపించి, నాన్నారు కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మానికి చెరో వైపు కూర్చున్నాం.

మనం ఎదురు చూస్తున్నప్పుడే కాలం పగబట్టిన దానిలా మరింత మెల్లిగా సాగుతుంది. అప్పటికీ అన్నయ్య లోపలికి వెళ్ళి మా గడియారంలో చిన్న ముల్లును రెండంకెలు ముందుకు జరిపాడు కూడా. అయిన ఫలితం లేకపోయింది. మా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నాన్న గారు రెండు సంచులతో వీధిలోకి అడుగుపెట్టారు.. మేము పరిగేట్టుకుని వెళ్ళి ఆయన్ను అక్కడే ఆపి, సంచీలు దించి, మాకు కావలసినవి అందులో ఉన్నాయని రూఢి చేసుకున్నాక ఇంటికి రానిచ్చాం. ఇంటికి రాగానే పండ్ల మీదకు పడబోయేసరికి అమ్మ ఆపి, భోజనం చేసాకే ఏదైనా అని, మా ఉత్సాహానికి బ్రేకులు వేసింది. పైకి తన్నుకొస్తున్న కోపంతో కూడిన కన్నీళ్ళను లోపలికి నెట్టి, పండ్లకేసి ఆశగా చూస్తూ, వంట ఎప్పుడౌతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నాం. వంట అయీ అవ్వడంతోనే కంచాలు తెచ్చేసుకుని అమ్మ ఏది పెడితే అది గబగబా తినేసి ఒలంపిక్స్ లో గెలుచుకున్న బంగారు పతకం పట్టుకున్నంత అపురూపంగా మామిడి పండ్లను పట్టుకుని మెట్ల మీదకు చేరాము..

అవే ఇప్పుడు మా కళ్ళ ముందున్నాయి. ఆ రసాలను చూస్తూనే అమాంతంగా నోట్లో వేసుకుని గుటుక్కుమనిపించాలని బలంగా అనిపిస్తున్నా మా ప్రతిజ్ఞను ఒకరికి ఒకరం గుర్తు చేసుకుంటూ బలవంతం మీద నిగ్రహించుకున్నాం. మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కావలసినవి ఏంటి? అవి దొరికాక తాండ్రను ఎలా చేయాలి..అవి మా ముందున్న ప్రశ్నలు..కాని మా అన్నయ్య ఉన్నాడే!! తనకు తెలియంది లేదు (అని అనుకునేదాన్ని అప్పట్లో). ఏది చెప్పినా అది నిజం, అదే నిజం, అది మాత్రమే నిజం అనుకునేలా చెప్తాడు. అప్పట్లో వచ్చే బూస్ట్ ఏడ్ చూపించి సునీల్ గవాస్కర్ కొడుకు సచిన్ టెండుల్కర్ అని చెప్పాడు. అదే నిజమని చాలా కాలం నమ్మాను కూడా. అది పక్కన పెడితే కర్తవ్యం తెలియక కంగారు పడుతున్న నా భుజం మీద చెయ్యి వేసి, 'పిచ్చిదానా ఎంటీవోడంతటి అన్నయ్య నీకుండగా నీకేల బెంగ ' అన్నట్లు ఒక నవ్వు నవ్వి, 'నాకు తాండ్ర ఎలా చేయాలో తెల్సు. ఏముంది ముందు మామిడి పండ్ల రసం తీసి, దాన్లో ఒక కేజీ ఓ పది కేజీలో పంచదార పోసి మిక్సీలో పావుగంట తిప్పి కంచంలో ఆరబోసి ఎండలో నాలుగు రోజులు పెడితే నోట్లో వెన్నలా కరిగిపోయే తాండ్ర రెడీ' అని నాకు ధైర్యం చెప్పాడు.

మరుసటి రోజు అమ్మానాన్న ఆఫీసుకు వెళ్ళేదాక గోతి కాడ నక్కల్లా ఎదురుచూసి, వాళ్ళు వెళ్ళడమేమిటి మా ప్రయోగం మొదలుపెట్టాం. మిక్సీ చేసాక పళ్ళెంలో ఆ రసాన్ని పోసి, దాని వైపు ఆశగా చూస్తూ 'మామిడి వంటి పండుయు..' అని అశువుగా కవిత్వం చెప్పబోతూంటే 'తాండ్ర వంటి స్వీటుయు..' అని అన్నయ్య అందుకున్నాడు. ఆ పళ్ళాన్ని మేడ మీద ఎండబెట్టి దాన్నే చూస్తూ కూర్చున్నాం. మాలో ఏ ఒక్కరు మంచి నీళ్ళ కోసమో, మరో దాని కోసమో కిందకు దిగినా తక్కిన వాళ్ళు వెంట వెళ్ళాల్సిందే, ఈలోగా ఇంకొకరు ఎక్కడ దాన్ని గుటకాయం స్వాహః చేస్తారేమో అన్న భయంతో. రాత్రుళ్ళు మాకు మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశాల్లో దాస్తూ, పొద్దున్న రెప్ప వేయకుండా కాపలాలు కాస్తూ నాలుగు రోజులు గడిపాం. నాలుగో రోజు 'ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి..' అని పాడుకుంటూ మా స్వహస్తాలతో చేసుకున్న ఆ అమృతాన్ని మా మధ్యలో ఉంచుకుని ఒకొక్క ముక్క నోట్లో వేసుకున్నాం. వెంటనే ఒకరి మొహంలోకి ఒకరం చూసుకున్నాం, మా మొహాల్లో రంగులు మారాయి. కాజాలో మాగాయి ముక్క పెట్టుకుని దాన్ని సాస్ లో ముంచుకుని తింటే ఎలా ఉంటుందో దాని కన్నా అధ్వానంగా ఉంది మా వంటకం. ఎంతైనా మేము చేసుకున్నది కదా, పారెయ్యడానికి చేతులు రాక మరో రెండు ముక్కలు నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించాం. ఊహు! వల్ల కాలేదు. గుడ్ల నీరు కక్కుకుంటూ మా అమృతాన్ని, మా పంచదార గుళికను, మా వజ్రాల తునకను కాలువలో జారవిడిచాం. ఆ తర్వాత కరువు తీరా ఏడ్చి, అమ్మ రాకముందే మొహాలు కడుకున్ని కూర్చున్నాం. ఆ రాత్రి ఒకటే వాంతులు. 'ఏం తిన్నార్రా' అని అమ్మ అడిగితే నోరు మెదిపితేనా. ఎలా చెప్తాం! తేలు కుట్టిన దొంగలం కదా!!

1, ఆగస్టు 2010, ఆదివారం

స్నేహానికి చిరునామా

మొదటిసారి మేము కలిసింది మా ఇంట్లో. రాష్ట్రానికి దూరంగా ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజిలో మా ఇద్దరికీ ప్రవేశం వచ్చిందని తెలిసి పరిచయం చేసుకుందామని తను, వాళ్ళ అమ్మగారు ఒక ఆదివారం ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము పెద్దగా మాట్లాడింది లేదు, ఊరకే పది నిముషాలు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కలిసి ప్రయాణం చేసి కాలేజి ఉండే ఊరు చేరుకున్నాం. ప్రయాణంలో నేను మాట్లాడదామని ప్రయత్నించినా తను అప్పర్ బెర్త్ నుంచీ కిందకు దిగితేనా! అప్పటికీ మంచి చేసుకుందామని నా హనీఫేబ్ చాక్లేటు ఒకటి ఇచ్చా కూడా.

మా ఇద్దరితో పాటు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని దిగపెట్టడానికి వచ్చారు. నాకు అదే మొదటిసారి అమ్మానాన్నలను విడిచి దూరప్రాంతంలో ఉండాల్సిరావడం. తనకూ దాదాపుగా అంతే. వాళ్ళు ఇంకాసేపట్లో బయల్దేరుతారనగా, లేడీస్ హాస్టల్ ముందు వేసిన కుర్చీలలో కూర్చుని వీడుకోలు చెబుతున్నాం. అంతకుముందు రోజు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 'ఎప్పుడూ ఏడవని నాన్న నిన్ను వదిలివెళుతున్నామని నిన్న వెక్కి వెక్కి ఏడ్చారు, నువ్వు ఏ మాత్రం బెంగ పడుతున్నావని తెలిసినా తట్టుకోలేరు, నువ్వు ధైర్యంగా మాకు వీడ్కోలు చెప్పాలి '. కాని మరో ఆరు నెలల దాకా వారిని చూసేది లేదు అని అనుకున్న ప్రతి సారి దుఃఖం తన్నుకుని కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తోంది. కళ్ళల్లోకి వచ్చిన నీరు కిందకు జారకుండా ఆపడానికి నా శక్తంతా కూడదీసుకోవలసి వచ్చింది. అమ్మా వాళ్ళు బయలుదేరడంతో ఇద్దరం ధారగా కారుతున్న కన్నీటిని తుడిచే ప్రయత్నమైనా చేయకుండా హాస్టల్ లోకి పరిగెత్తాం. ఇద్దరివీ పక్క పక్క గదులే. నేను గదిలోకి వెళ్ళి కరువు తీరా ఏడ్చాను. ఎంత ఆలోచించకూడదనుకున్నా ఇక అమ్మానాన్నలను చూసేది ఆరునెలలకొకసారి మాత్రమే, చదువు అవ్వంగానే ఉద్యోగం, తర్వాత పెళ్ళి , ఇంక వాళ్ళ దగ్గరుండే అదృష్టం, అవకాశం ఉండవు అన్న సత్యం మరీ మరీ ఏడిపిస్తోంది. ఇంతలో నా గది తలుపు ఎవరో తట్టినట్టుంటే కళ్ళు తుడుచుకుని వెళ్ళి తీసా. తనే! లోపలికి వచ్చింది మాట్లాడకుండా. తన మొహం చూసా. అసలే తెల్లని మొహమేమో ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి, మొహం కందిపోయింది. నా మటుకు నేనే బాధలో ఉన్నా తనను చూసి జాలేసింది. ఏవో సామాన్లు కొనడానికి కలిసి బయటకు వెళ్ళాం.

తర్వాత ఎవరికి ఉత్తరం వచ్చినా పక్కవారికి చూపించి, ఉత్తరాల్లో ఆ అక్షరాలు తడిమి అమ్మానాన్నలను చూసినట్టు ఆనందపడేవాళ్ళం. రోజులు గడుస్తున్న కొద్దీ మాకు తెలియకుండానే మా బంధం దృఢపడింది. మాకు ఇంకొంతమంది స్నేహితులయ్యారు. మొత్తం పదిమందిమి కలిసికట్టుగా ఒకరి కష్టసుఖాలను మిగిలిన వాళ్ళు పంచుకుంటూ ఉండేవాళ్ళం. ఎంతమందిలో ఉన్నా పక్కన తనుందంటే అదో ధీమా, ధైర్యం. ఫలానా పరిస్థితిలో నేనేలా స్పందిస్తాను, ఎలా ఆలోచిస్తాను, ఏం నిర్ణయం తీసుకుంటాను అనేది తనకు, అలాగే తన విషయంలో నాకు ఇట్టే తెలిసిపోయేది. బహిఃప్రాణం అంటారు చూడండీ, అచ్చంగా నాకు తను అదే. బాధలో ఉన్నప్పుడు ఒకరినొకరం ఓదార్చుకోవడానికి మాకు మాటలక్కర్లేదు, ఒకరి సామీప్యమొకరికుంటే చాలు. దగ్గరకొచ్చి ఒక పావుగంట కూర్చుంటే చాలు ఎంతో ఉపశమనం పొందినట్టుగా ఉండేది. దయ్యం సినిమా చూసిన ప్రతీ రాత్రి నా పడక తన గదిలోనే. నిద్రపోకుండా గంటల తరబడి జీవితం గురించి, భవిష్యత్ గురించి, ఏదో ఓదాని గురించి మాట్లాడుకునేవాళ్ళం. అలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో ఆడుతూ పాడుతూ మా చదువు పూర్తి చేసాం.

అదృష్టవశాత్తు ఇద్దరికీ ఒకే కంపెనీలో ఉద్యోగం. ఎంతో సంతోషించాం కాని తర్వాత తెలిసిందేమిటంటే వేరే వేరే ప్రదేశాలలో పోస్టింగ్. నాకు బెంగుళూరు, తనకు హైదరాబాద్. ఏముందిలే ఫోన్లు చేసుకుంటూ, ఉత్తరాలు రాసుకుంటూ ఉండలేమా అనుకున్నా..కాని కొన్ని రోజుల్లోనే నాకు తన లోటు బాగా తెలిసొచ్చింది. ఏ పుస్తకం చూసినా, ఏ సినిమా చూసినా, ఏ పని చేసినా తనతో చర్చించనిదే స్థిమితం ఉండేది కాదు, ఏ పనిలోనూ ఆనందం లేదు. నా పై అధికారులకు అర్జీలు పెట్టుకుని, దేవుడికి మొక్కులు మొక్కుకుని ఎలాగైతేనేం, హైదరాబాద్ కు బదిలీ సంపాదించా. ఇకనే ఇద్దరం మహోత్సాహం తో ఇళ్ళ వేట మొదలుపెట్టాం. మెహదీపట్నంలో ఒక మాంచి ఇల్లు దొరికింది, ఒక గది : అదే హాలు, అదే పడక గది, అదే వంట గది, అటాచ్డ్ బాత్. ఇంకేం కావాలి? మనసులు విశాలమై ఉన్నప్పుడు ఇరుకు గదులు కూడా అందంగా కనిపిస్తాయి. మళ్ళీ జీవితంలో హ్యాపీ డేస్ మొదలు. పొద్దున్న లేవడం, ఇష్టమైతే వండుకోవడం, లేదంటే ఆఫీస్ లో తినడం, సాయంత్రం వచ్చి ఇద్దరికీ నచ్చిన పాత సినిమాలను చూస్తూ కూర్చోవడం. వారాంతాల సంగతి చెప్పనే అక్కర్లేదు. మా స్నేహం మొదలైన దగ్గరనుంచీ మాకు భేదాభిప్రాయాలే రాలేదంటే నమ్మండి.

కాని సవాళ్ళు ఎదుర్కున్నప్పుడే మనిషైనా, బంధమైనా దృడమయ్యేది. మా స్నేహానికి మొదటి పరీక్ష ఎదురయ్యింది. తనకు పెళ్ళి కుదిరింది. ఇంకో సంతోషకరమైన వార్త ఏమిటంటే తను చేసుకోబోయేది స్వయానా మా చిన్నాన్నగారబ్బాయినే. నా ఆనందానికి అవధులు లేకపోయాయి. కాని ఆ సంతోషం అట్టే కాలం అలాగే నిలవలేదు. అప్పటి దాకా తన సమయమంతా నాది, నా చెవి తినే హక్కు తనది. ఇప్పుడు నాకివ్వడానికి తన దగ్గర టైమే లేకపోయింది. పొద్దున్న లేవడమే ఫోన్ కాల్ తో, అప్పుడు పట్టుకున్న ఫోన్ ఎప్పుడు వదిలేదీ నాకు తెలిసేదే కాదు. ఎందుకంటే నేను పడుకునే సమయానికి ఇంకా తను మాట్లాడుతూనే ఉండేది.

నాకు ఎక్కడ లేని కోపం వచ్చేది. అన్నయ్య మీద అసూయ, ఆగ్రహం కలిగేవి. తనతో రోజుల తరబడి మాట్లాడేదాన్ని కాదు. పాపం ఇద్దరి మధ్య తను నలిగిపోయేది. తన బాధ నాకు వివరించడానికి ప్రయత్నించేది, నేను వింటేగా! ఎందుకంత సేపు మాట్లాడాలి నాకు అర్ధమయ్యేది కాదు. నేనేక్కువా అన్నయ్యెక్కువా అని అడిగేదాన్ని. అప్పటి నా మూర్ఖత్వం తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. అలా నేను తనను చాలా బాధపెట్టా. కాలక్రమేణా నాకు పెళ్ళయ్యింది. ఎందుకు మాట్లాడాలో అప్పుడు అర్ధమయ్యింది :-)

ఇప్పుడు తను ఒక బిడ్డకు తల్లి కూడా. నా బహిఃప్రాణం మరో చిన్ని ప్రాణానికి జన్మనిచ్చింది. మా స్నేహం బాలారిష్టాలన్నిటినీ దాటుకుని స్థిరంగా నిలుచుంది. త్వరలోనే తను అమెరికాకు ప్రయాణమౌతోంది. దూరం కాని, మరొకటి ఏదైనా కాని ఇప్పుడు మమ్మల్ని విడదీయలేదు.

ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా ప్రాణ స్నేహితురాలికి శుభాకాంక్షలు. నేను చేసిన తప్పుకు బ్లాగ్ముఖంగా తనకు క్షమాపణలు.

అలాగే నా స్నేహితులందరికీ, బ్లాగ్మిత్రులందిరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

27, జులై 2010, మంగళవారం

వెన్నెల, వర్షం కలిసి వస్తే

నిన్నటి 'పాడుతా తీయగా' వీక్షకులకు సరిగ్గా అలాంటి అనుభూతే కలిగి ఉంటుంది.
మన గాన గంధర్వుని కార్యక్రమం లో వెన్నెల కురిసింది, కాదు కాదు సిరివెన్నెల కురిసింది.

ఆరు బయట వెన్నెల్లో కూర్చుని చందమామ కథలు వింటూ, అమ్మ చేతి గోరుముద్దలు తినడం ఎంత హాయో, మన సిరివెన్నెల గారి మాట అంత హాయి, పాట అంత హాయి..
అతిధి లా వచ్చి చిరునవ్వుల, చిరుపాటల సిరివెన్నెలలు కురిపిస్తూ మన సీతారామ శాస్త్రి గారు, ఆయన పాటలలోని ఆణిముత్యాలను పాడి, పాడించి ఆ ఆనంద ధారలలో మనను తడుపుతూ మన ఎస్.పి.బి ప్రేక్షకులను ఆనందసాగరం లో ఓలలాడించారు

"ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం" పాటతో ఎంచగ్గా కార్యక్రమం మొదలయ్యింది..
ఎంతో శ్రావ్యంగా పాడింది గుంటూరు అమ్మాయి ..

ఈ పాట గురించి వ్యాఖ్యానిస్తూ సిరివెన్నెల గారు ఇలా అన్నారు, (సరిగ్గా ఇలానే కాకపోయినా నాకు గుర్తున్నంత వరకు ఇంచుమించుగా..)

"మొన్నామధ్య నా దగ్గరకు ఒక అరడజను మంది ఆడపిల్లలు వచ్చారు, నా అభిమానులు.
మాటల సందర్భంగా ఇలా అన్నాను, 'ఎంత సేపు మీరు సమాన హక్కులు, సమాన హక్కులు అంటారే కాని, మగవాళ్ళతో సమాన స్థాయికి రావలంటే మీరు ఒక పది మెట్లు కిందకు దిగి రావాలి, మీరు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మాకన్నా ఒక పది మెట్లు పైనే ఉన్నారు..
మగవాళ్ళు చేసిన పనులన్నీ మీరు చేయగలరు, కాని ఒక శిశువుని కని ఒక మహా మనీషి గా తయారు చేసే సామర్ధ్యం మాత్రం మీదే, మాకు లేదు
అందుకే తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కాని ఇంగ్లీషు వాడు కూడా కంప్యూటర్ ని మదర్ బోర్ద్ అన్నాడు కాని ఫాదర్ బోర్ద్ అనలేదు.."

మరెన్నో మంచి పాటలతో, ఎస్.పి.బి. సిరివెన్నెలల మాటలతో కార్యక్రమం హుషారుగా సాగింది

కార్యక్రమంలో సిరివెన్నెల కు పది నందులను తెచ్చిన పది ఆణిముత్యాలను మనకు బిట్లుగా వినిపించారు..
అవి
"విధాత తలపున (సిరివెన్నెల)", "తెలవారదేమో స్వామి (శృతిలయలు)", "అందెల రవమిది (స్వర్ణ కమలం)", "సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని (గాయం)", "చిలక ఏ తోడు లేక (శుభలగ్నం)", "మనసు కాస్త కలత పడితే (శ్రీకారం)", "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని (సింధూరం)", "దేవుడు కరుణిస్తాడని (ప్రేమ కథ)", "జగమంత కుటుంబం నాది (చక్రం)", "ఎంత వరకు ఇంత పరుగు (గమ్యం)"

చివర్లో సంగీత పోటీల పేరుతో పిల్లలని ఏడిపిస్తున్న కార్యక్రమాలకు, చానళ్ళ వారికి చురకలు వేసారు..
"మీ అమ్మాయి జయమాలిని లా ఉంది, సిల్కు స్మిత లా డాన్సు చేసింది" అంటే పొంగిపోతున్న ఈ కాలంలో
ఎక్కడా అసభ్యత కలిగిన పాటలకు తావు ఇవ్వకుండా, ఏడుపులు పెడబొబ్బలు లేకుండా ఎంతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న బాలు గారిని అభినందించారు.

ఈ కార్యక్రమం ఈ శుక్రవారం సాయంత్రం తిరిగి (ఈ టీ.వీ. లో) ప్రసారమౌతుంది, వీలున్నవాళ్ళు చూడండి.
సిరివెన్నెల తో తరువాయి భాగం వచ్చే సోమవారం 9:30 గంటలకు..

26, జులై 2010, సోమవారం

రక్త చరిత్ర

టపా పేరు చూసి ఇదేదో రాంగోపాల్ వర్మ సినిమా గురించి అనుకునేరు. రక్తంతో రంగరించిన నా అనుభవాల కథే ఈ రక్త చరిత్ర . రక్తంతో నాకు చాలానే అనుభవాలు ఉన్నా ముఖ్యంగా రెండు సంఘటనలు మటుకు చెప్తాను

సీన్-1:
అది మా కాలేజీలో రక్తదానశిబిరం జరుగుతున్న ప్రదేశం. నా స్నేహితులంతా చిరంజీవి సినిమా మొదటి ఆట టికెట్ల కోసం ఎగబడినట్లు పోటీపడి మరీ రక్తదానం చెయ్యడానికి వెళ్తున్నారు. వారందరికీ మోటివేషన్ : రక్తం ఇచ్చే ప్రతీ వారికి ఒక ఫ్రూటి, ఒక బిస్కట్ల పాకెట్ ఇస్తున్నారనే వార్త. నేనేం తక్కువ తిన్నానా, నా యధాశక్తి నేనూ రక్తదానం చేద్దామని బయల్దేరాను. అసలు ఈ రక్తదానం చెయ్యలనే కోరిక ఈనాటిది కాదు. ఎప్పుడో స్కూల్లో చదువుతున్నప్పటినుంచి అనుకుంటున్నా, స్కూల్లో ఆడుతున్నప్పుడు పక్కవాడి రక్తం కళ్ళజూడడమే తప్ప నా రక్తం ఇచ్చే అవకాశం ఎప్పుడూ కలగలేదు.

రక్తం ఇస్తానంటే 'నీ మొహం! నీకు రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి ఇవ్వడం కూడానా' అని నిరుత్సాహపరిచే అమ్మానాన్నలకు దూరంగా హాస్టల్లో ఉన్నందువల్ల, ఇక్కడ మనం విచ్చలవిడిగా రక్తం ఇచ్చేసుకోవచ్చు అని సంతోషపడుతూ శిబిరం దగ్గరకు వెళ్ళా. అక్కడి నిర్వాహకులు 'ప్రస్తుతం మేము పెట్టినది రక్తం తీసుకునే శిబిరం, ఇచ్చే శిబిరం పెట్టినప్పుడు నీకు కబురు పంపుతాము ' అని మర్యాదగా చెప్పారు, నా పర్సనాలిటీని చూసి. ఈ అవమానానికి నా రక్తం వెచ్చబడింది, కళ్ళు ఎర్రబడ్డాయి. 'రక్తం ఇవ్వడానికి కావల్సిన అర్హతలు అన్నీ నాకు ఉన్నాయి (కనీస బరువు 45 కేజీలు - మనం సరిగ్గా 45 ఉన్నామప్పుడు), నా రక్తం ఎందుకు తీసుకోరు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన ' అని వారితో పెద్ద యుద్దమే చేసి వాళ్ళు లొంగకపోతే, ఆనక బ్రతిమాలి బుజ్జగించి ఎలాగైతేనేం నా రక్తం తీసుకోవడానికి ఒప్పించా.
రక్తం తీసుకునేముందు సూదిని వేలులోకి గుచ్చి ఒక చుక్క రక్తం పరీక్షకు తీసుకుని, అనీమికో కాదో చూసి, బ్లడ్ గ్రూపు నిర్ధారించుకుని తీసుకోవడం పరిపాటు. దాని కోసం ఒక వాలంటీరు పక్కనే ఉన్నాడు.

రక్తం ఇవ్వడానికి పేద్ద యుద్దమైతే చేసా కాని మనకు రక్తం చూస్తేనే బెదురు. వాలంటీరు ఆ సూదిని నా వేలులోకి పొడిచి చిత్రహింసలు పెట్టడానికి సిద్దంగా ఉన్నాడు. బలికి తనంతట తనే పోయే గొర్రెపిల్లలా నేను వెళ్ళి అక్కడ నిల్చుని నా సున్నితమైన వేలుని ఆ కర్కశమైన చేతుల్లో పెట్టా. సూది దగ్గరగా రావడం, నేను చేతిని వెనక్కు లాక్కోవడం ఇదే తంతు ఒక పది నిముషాల పాటు జరిగింది. ఇంక లాభం లేదని అక్కడ ఉన్న వాలంటీర్లు అంతా కలిసి నన్ను పట్టుకుని నా వేలును ముందుకు తోసారు. సూది నా వేలులోకి దిగడం వరకు గుర్తుంది.ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరచి చూసేసరికి నేను ఒక బెడ్ మీద పడుక్కుని ఉన్నా. నా చుట్టూ నా స్నేహితులంతా ఏడుపు నవ్వు కలిపిన మొహాలతో, డబ్ చేసిన అరవ సినిమాలోని కామెడీ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రేక్షకుల్లా నిల్చుని ఉన్నారు. నేను కళ్ళు తెరచి చూసేసరికి ఆనందం పట్టలేక, ఇటుపక్క, అటుపక్క రక్తదానం చేసిన వాళ్ళ దగ్గర పెట్టిన బిస్కెట్లు, ఫ్రూటి స్మగుల్ చేసి నాకిచ్చారు. అవి తిని, తాగి మూడు రోజులు బెడ్ రెస్టు తీసుకుంటే కాని మామూలు మనిషిని కాలేకపోయా. ఇక ఆ దెబ్బకు మరి రక్తదానం చెయ్యాలనే పైత్యపు ఆలోచనలు దగ్గరకు రానియ్యకుండా జాగ్రత్తగా ఉంటూ వచ్చా. మరొకసారి నా రక్తం ఇవ్వాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కాని మనం అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది తెలుగు సినిమా అవుతుంది కాని జీవితం ఎలా అవుతుంది?

సీన్-2
జీవితం ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా హాయిగా గడిచిపోతోంది. మా ఆఫీసులో మా టీం తరుపున విదేశంలో పనిచెయ్యడానికి నన్ను ఎంపిక చేసారు. వెళ్ళవలసినది నా కలల దేశమైన స్విట్జెర్లాండ్ కి. ఆ విషయం తెలిసినప్పటి నుండి, నేను నేల మీద నిల్చోవడం మానేసా. 'గాల్లో తేలినట్టుందే..' అని పాడుకుంటూ మబ్బుల్లో షికారు కొడుతున్నా. నా ఆనందాన్ని చూసి సహించలేని మా టీమ్మేట్ నా ఆనందంపై నీళ్ళు జల్లుతూ ఒక పిడుగులాంటి వార్త చెప్పింది. 'యెస్ మీరు సరిగ్గానే ఊహించారు' అది విదేశాలకు వెళ్ళే ప్రతీ వారు మెడికల్ టెస్ట్ చేయించుకోవాలని, మెడికల్ టెస్ట్ లో భాగంగా బ్లడ్ టెస్ట్ చేస్తారని. అప్పటి దాకా మబ్బుల్లో తేలుతూ ఉన్న నేను ఆ మాట వినగానే జెట్ స్పీడుతో వచ్చి నేలపై దబ్బని పడ్డా. లేచి విరిగిన ఎముకలు లెక్కపెట్టుకుంటూ ఉంటే మా డేమేజర్, సారీ మేనేజర్ వచ్చి నేను రక్తపరీక్షకు వెళ్ళాల్సింది ఆ మర్నాడే అని మరొక బాంబు పేల్చాడు.

ఏం చేయాలి! ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలి! వెళ్ళడం మానుకుంటేనో? ఛీ అందరి ముందర చులకనైపోతాం. ఇప్పటికే అడగనివాళ్ళకు అడిగినవాళ్ళకు మన ప్రయాణం గురించి చెప్పేసాం. సరే ఆసుపత్రిలో నర్సుకు ఒక వంద ఇచ్చి, వేరే ఎవరి రక్తమైనా మన రక్తంగా ఇప్పిస్తే? ఊహుం ఈ అవిడియా వర్కౌటు అయ్యేలా లేదు. పని జరక్కపోగా అసలుకే మోసం వస్తే ప్రమాదం. సరే ఏమైతే అయ్యిందని ఆ రోజు ఇంటికి వెళ్ళి పాతాలభైరవి సినిమా పెట్టుకుని చూసి, బ్రదర్ తోట రాముడు ఇచ్చిన స్పూర్తితో 'ధైర్యే సాహసే లక్ష్మి ' అనుకుని రక్తం ఇవ్వడానికే నిశ్చయించుకున్నా.

మరునాడు వర్జ్యం అదీ లేకుండా చూసి ఇంటినుండి బయలుదేరేవేళకు హిమేష్ రేషమ్మియా పాట పాడినట్టు ఆకాశవాణి వికృతంగా నవ్వింది. ఇదేం అపశకునం రా బాబూ అనుకుంటూ, అయినా కార్య సాధకులు ఇలాంటివి లెక్క చేయకూడదని ధైర్యంగా హాస్పిటల్లోకి అడుగుపెట్టా. లేని ఉత్సాహం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కాల్గేట్ ఏడ్ లో సచిన్ లా 1000 వాట్ స్మైల్ ఇస్తూ రెసెప్షనిస్ట్ కి నా అపాయింట్మెంట్ గురించి చెప్పా.

ఆవిడ లోపల ఎవరో వున్నారు, వారు రాగానే పంపిస్తా అందాక కూర్చోమని చెప్పింది. నా వెనకే ఒకాయన ఒక చిన్న పిల్లతో వచ్చి కూర్చున్నాడు. ఆ పాప వాళ్ళ నాన్నను రక్త పరీక్ష గురించి ప్రశ్నలు అడుగుతోంది, రక్తం ఎలా తీస్తారు, తీసినప్పుడు నొప్పెడుతుందా, తీసేసాక నొప్పెడుతుందా అంటూ. అసలే ఆందోళనగా ఉన్నా, అది కనపడనీయకుండా డాంబికంగా కూర్చున్న నాకు ఆ మాటలు వింటుంటే బి.పి పెరిగిపోతోంది. అవి వినపడకూడదని నా సెల్ ఫోన్ తీసి రేడియో ఆన్ చేసా. 'నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు..' అంటూ ఆర్.నారాయణమూర్తి గారు గోలపెడుతున్నారు. విధి పగబట్టింది అని పుస్తకాల్లో, కథల్లో చదువుతున్నప్పుడు అర్ధం కాలేదు, ఇప్పుడు తెల్సింది అనుకుంటూ రేడియో ఆఫ్ చెయ్యంగానే నాకు పిలుపు వచ్చింది. నా వెనకే ఆ పాప కూడా ఆ గదిలోకి వచ్చి వేరే టేబుల్ దగ్గర కూర్చుంది. నా చేయి ధీమాగా నర్సు చేతికి ఇవ్వడం చూపించి వాళ్ళ నాన్నగారు, 'అక్కను చూడు ఎలా భయపడకుండా ఉందో, నువ్వూ అలాగే ఉండాలి ' అంటూ పాపకు ధైర్యం చెప్తున్నారు. నేను కళ్ళు మూసుకుని, వాళ్ళ మాటలు వింటూ నాకు రక్తం తీస్తున్నారనే సంగతి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా. కాని కాసేపటికి నాకు వాళ్ళ మాటలు వినపడడం మానేసాయి. కళ్ళు తెరిచి చూసేసరికి నేను టేబుల్ పై తల పెట్టుకుని పడుకుని ఉన్నా. పోనిలే ఎదైతే ఏం, మొత్తానికి ఈ ప్రహసనం ముగిసింది అని ఆనందపడుతూ లేవబోయేసరికి నర్స్ వచ్చి, 'మేడం మీకింకా రక్తం తీయడం పూర్తి కాలేదు, మా సీసా ఎర్రబడిందో లేదో మీ కళ్ళు మూతలు పడి రెండు గంటల తర్వాత ఇప్పుడే లేచారు ' అంది. నా పరిస్థితే ఇలా ఉంటే, పాపం ఆ పాప పరిస్థితి ఎలా ఉందో అని విచారపడుతూ 'పాపను పక్క గదిలో పడుకోబెట్టారా' అని అడిగాను. 'పడుకోబెట్టడం ఏంటి ఆ పాప రక్తం ఇచ్చేసి, అక్కకు లేచాక టాటా చెప్పమని చెప్పి ఆడుతూ పాడుతూ ఎప్పుడో వెళ్ళిపోయింది ' అని చెప్పింది నర్సు. ఈ సంఘటన నా రిపోర్టులోకి రానివ్వద్దని నర్సును బ్రతిమాలుకుని, రక్తం ఇవ్వడానికి మరో మంచి ముహూర్తం చూసుకుని వస్తానని చెప్పి అక్కడి నుండి బయటపడ్డా.

22, జులై 2010, గురువారం

చిన్ననాటి కథలు-2

ఈ కథ మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ తాతగారు చెప్పినది, అడిగి అడిగి మరీ చిన్నప్పుడు ఇది చెప్పించుకునేవాళ్ళం :-)

ఒకానొక ఊరిలో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి పెద్దగా పాండిత్యం అబ్బకపోయినా భార్యాబిడ్డలను పోషించడానికి పురాణ కాలక్షేపం పేరుతో తన నోటికి వచ్చింది చెప్తూ నాలుగు రాళ్ళను సంపాదించేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లోవాళ్ళకు ఇతని సంగతి అర్ధమయ్యి ఇతనికి ఆదరణ కరువౌతుంది. దాంతో పొట్ట చేత పట్టుకుని కొంత దూరం ప్రయాణం చేసి వేరే ఊరు చేరుకుంటాడు. ఆ ఊరి ప్రజలు బొత్తిగా అమాయకులని, అజ్ఞానులని గ్రహించి పురాణప్రవచనాలు చేస్తానని చెప్పి ఆ ఊర్లోనే స్థిరపడిపోతాడు. ఆ ఊరి ప్రజలు పాపం ఇతను చెప్పిందే వింటూ ఈ బ్రాహ్మడిని దైవాంశ సంభూతునిగా భావించి గౌరవిస్తూ ఉంటారు.
కొంత కాలానికి ఒక నిజమైన పండితుడు ఆ ఊరి మీదుగా పోతూ చీకటి పడడంతో ఆ రాత్రికి అక్కడే బస చేయదలచి ఊరి కరణం వద్దకు పోయి తనకు ఆ రాత్రికి ఆశ్రయమిమ్మని కోరతాడు. కరణం మహదానందంగా ఒప్పుకుని కావలసిన ఏర్పాట్లు అన్నీ చూస్తాడు. పండితుడు భోజనం కానిచ్చి ఇక విశ్రమిద్దామని నడుం వాల్చబోతుంటే, ఊరి ప్రజలంతా కలిసి రామాలయం వేపుకు వెళ్తూ ఉండడం గమనించి కరణాన్ని ఆ సంగతి అడుగుతాడు. తమ ఊరిలో రోజూ ఒక మహానుభావుడు పురాణ ప్రసంగం చేస్తాడని, తాను కూడా అక్కడికే పోతున్నానని, ఆ పండితుని కూడా వచ్చి విని తరించవలసిందిగా చెప్తాడు. సరే ఎలాగో చేసేది ఏమీ లేదు కనుక కాస్త కాలక్షేపంగా ఉంటుందని తలచి పండితుడు కూడా బయలుదేరతాడు.
పురాణ శ్రవణం మొదలైన కాసేపటికి పండితుడికి ఏ పురాణం చెప్తున్నారో, దేని గురించి చెప్తున్నారో బొత్తిగా అర్ధం కాక లేచి సంస్కృతం లో 'కిం' అని ప్రశ్నిస్తాడు (అంటే ఏంటి అని అర్ధం). ఆ ఊరి ప్రజలు చెప్తే వినడమే కాని ఎన్నడూ ప్రశ్నించని వారవడం చేత ఈ పండితుని వైపు అబ్బురపడుతూ చూసి ' కొత్త పంతులుగోరు ఏదో గొప్ప ప్రశ్న వేసారురా, మన పంతులు గారు ఏం చెప్తారో విందామ'ని అనుకోసాగారు. అందరి దృష్టి తన మీదే ఉండడం గ్రహించి ఆ పండితుని నోరు ఎలా అయినా మూయించకపోతే అక్కడ తన ఉనికికే ముప్పు కలుగుతుందని భావించి,
'కిం లేదు కం లేదు
గూట్లో మంచం
విత్తుల పందెం
పంట నలుతుం
మా ఎల్లెద్దు కొం
ఎదురం లో ఢం ఢం
ఇక పో ఝం ఝం' అని నోటికి వచ్చింది అనేస్తాడు.
ఆ అమాయక ప్రజలు పాపం, 'ఆ కొత్త పంతులు ఒక ముక్క అడిగాడో లేదో మన పంతులు గారు ఎంత లావాటి సమాధానం చెప్పారురా' అనుకుని ఓ తెగ మురిసిపోతారు. అక్కడి పరిస్థితిని ఆకళింపు చేసుకున్న పండితుడు 'చెప్పినాయన బాగానే ఉన్నాడు, విన్నవాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మనకెందుకొచ్చింది బాధ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోవడమే ఉత్తమమని అనుకుని 'నమస్కారం' అంటాడు. దీనితో ఆ పంతులుకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, పండితుడు తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతున్నాడని ఇంకా తన పాండిత్యం ప్రదర్శిద్దామని,
' నమస్కారం లేదు గిమస్కారం లేదు
మా శత్రువులకు తిరస్కారం
నోరెత్తిన బహిష్కారం
ఇక మీరు లేచి పోవుట యశస్కారం ' అంటాడు.
సరే మర్యాదగా వెళ్ళిపోదామంటే ఈయన వెళ్ళనిచ్చేలా లేడు, ఇతనికి బుద్ధి చెప్పాల్సిందే అనుకుని, 'మహానుభావా మీ ముందు నేను పూర్తిగా ఓడిపోయాను, మీ పాండిత్యం ముందు నా ప్రతిభ వెల వెల పోతోంది, మీ దర్శన భాగ్యం తో నా జన్మ తరించింది, ఒకసారి దగ్గరగా వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోదలిచా 'నన్నాడు. దానికా బ్రాహ్మడు ఉబ్బితబ్బిబ్బై 'ఓ దానికేముందోయ్, నా అంతటి పాండిత్యం ప్రతీవారికి అబ్బుతుందా, సాధన చేస్తే పైకి వస్తావు ' అని డాంబికాలు పోతాడు. పండితుడు బ్రాహ్మడి దగ్గరగా వెళ్ళి తల నుంచి ఒక వెంట్రుక లాగి, 'ఓ ప్రజలారా, ఈయన సామాన్య వ్యక్తి కాదు, సాక్షాత్ సరస్వతీ పుత్రుడు, ఈయన వెంట్రుక తీసుకుని నేను నా పూజ గదిలో పెట్టుకుని రోజూ పూజ చేసుకుంటాను ' అని అక్కడినుండి చక్కాపోతాడు.
ఇక అక్కడి వెర్రి బాగుల వాళ్ళు మాకంటే మాకని పంతులు దగ్గరకు వచ్చి తలా చేతికందినన్ని వెంట్రుకలు పీకడం మొదలుపెడతారు. పంతులు నొప్పి తో కేకలేస్తుంటే 'ఉండండి పంతులుగోరూ, కాసేపలా మెదలకుండా ఉండండి, కాసిన్ని రోజుల్లో మళ్ళీ మొలిచెయ్యవేంటి, అప్పుడు మళ్ళీ వచ్చి మా బంధువులుకు కొన్ని పట్టుకెళ్ళాలి ' అని తల మీద, చేతుల మీద ఎవరికి దొరికినన్ని వాళ్ళు పీక్కుని ఇళ్ళకు వెళ్ళిపోతారు. 'బాబోయ్ ఈ మూర్ఖులు అన్నంతపని చెయ్యగలరు, ఇక ఇక్కడ ఉండడం క్షేమం కాద 'ని రాత్రికి రాత్రే మూట ముల్లె సర్దుకుని అక్కడినుండి పారిపోతాడు పంతులు.

21, జులై 2010, బుధవారం

చిన్ననాటి కథలు-1

సౌమ్య గారి 'ఏడుచేపల' కథ, మధురవాణి గారి 'మిరపకాయ పొట్టోడీ' కథ నా చిన్ననాటి జ్ఞాపకాలను వెలికితీసాయి.
ఈ కథ పిల్లలకు తప్పక నచ్చుతుంది.చిన్నప్పుడు నాకెంతో నచ్చిన (ఇప్పటికీ ఇష్టం అనుకోండి) కథలలో ఇదొకటి.

అనగనగా ఒక రాజుగారుండేవారు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు, పెద్ద భార్యకు ఒక్క వెంట్రుక, చిన్న భార్యకు రెండు వెంట్రుకలు. రాజుగారికి ఈ కారణం చేత చిన్నభార్యంటేనే ఇష్టం, పెద్ద భార్యను చిన్నచూపు చూసేవాడు. చిన్నరాణి ఎలాగోలా పెద్దరాణిని ఊరినుండి పంపించెయ్యాలని చూస్తూ ఉంటుంది. ఒకనాడు చిన్నరాణి అందంగా ముస్తాబయ్యి, తన రెండు వెంట్రుకలతో పేద్ద జడ అల్లుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళి పెద్దరాణి మీద పితూరిలు చెప్పి పెద్దరాణిని వెళ్ళగొట్టిస్తుంది.
పాపం పెద్దరాణి ఊరు వదిలి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో చెట్టుకు కట్టేసిన గుర్రం, దానికి దూరంగా గడ్డిమోపు కనిపిస్తాయి. ఆ గుర్రం 'నాకు ఆకలిగా ఉంది, గడ్డిమోపు చూస్తే నాకు అందకుండా ఉంది. కాస్త ఇటు పక్కకు జరిపితే నీ మేలు మరిచిపోనులే' అని బ్రతిమాలుతుంది. రాణి 'ఓ దానికేం భాగ్యం' అని గడ్డి గుర్రానికి వేసి ముందుకు పోతుంది. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట చీమలు దారికి అడ్డంగా బారులు తీరి కనిపిస్తాయి. 'మమ్మల్ని తొక్కకుండా చుట్టూ తిరిగి వెళ్ళిపో, నీకు పుణ్యం ఉంటుంది' అని దీనంగా వేడుకుంటాయి. రాణి అలానే అని చుట్టూ తిరిగి వెళ్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చాకలివాడు కనిపిస్తాడు 'ఏవమ్మా కాస్త ఈ చీరలు ఆరవేయటంలో సాయం చేసావంటే నీ పుణ్యం ఊరకే పోదులే' అంటాడు. 'సరే అలాగే' అని రాణి సాయం చేసి వెళ్తుంది. మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఒక ముని కనిపిస్తాడు. ఆ ముని దగ్గరకు వెళ్ళి రాణి తన కష్టాలను చెప్పుకుని ఏడుస్తుంది. ఆ ముని అప్పుడు జాలిపడి ఒక పండును రాణికి ఇచ్చి దాన్ని తిని పక్కనున్న సరస్సులో మూడు సార్లు మనగమంటాడు. రాణి మునికి దణ్ణం పెట్టుకుని సరస్సులో మూడు మునకలు వేసేసరికి పట్టులాంటి ఒత్తైన జుత్తు వచ్చేస్తుంది. పరమానందంతో మునికి కృతజ్ఞతలు చెప్పుకుని ఊరికి బయలుదేరుతుంది. దారిలో చాకలివాడు కనిపించి రాణికి పట్టువస్త్రాలు ఇస్తాడు. అవి కట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటే చీమలు తమకు చేసిన మేలుకు ప్రతిగా తమ పుట్టలో దాచిన నగలను తీసి రాణికి ఇస్తాయి. అవి అలంకరించుకుని ఇంకాస్త ముందుకెళ్ళేసరికి గుర్రం కనపడి 'నిన్ను మీ ఊళ్ళోకి తీసుకెళ్తాను ' అని చెప్పి ఎక్కించుకుంటుంది. ఆ గుర్రం ఎక్కి మంచి నగలతో పట్టు వస్త్రాలతో దేవకన్యలా వెలిగిపోతున్న రాణిని అంతఃపురంలోంచి రాజు చూసి తన తప్పును క్షమించమని చెప్పి, సాదరంగా లోపలికి తీసుకువెళ్తాడు. ఈ సంగతి తెలుసుకున్న చిన్న రాణి, పెద్ద రాణి దగ్గరకు వెళ్ళి ముని సంగతి తెలుసుకుని, తాను కూడా ముని దగ్గరకు బయలుదేరుతుంది.

దారిలో గుర్రం దాణా పెట్టమని అడిగితే 'రాణిని నాకే పని చెప్తావా' అని దాపులనున్న కర్ర పుచ్చుకుని గుర్రానికి నాలుగు వడ్డించి మరీ ముందుకెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక చీమలు కనిపించి తమను తొక్కవద్దని అడిగితే 'నా దారికి అడ్డంగా ఉన్నార'ని చీమలను తొక్కుకుంటూ వెళ్ళి సాయమడిగిన చాకలి బట్టల్ని చిందరవందర చేసి మునిని కలుసుకుని దొంగ కన్నీళ్ళతో వేడుకుంటుంది. ముని ఇచ్చిన పండు తిని, మూడు సార్లు మునిగితేనే పెద్ద రాణికి అంత జుత్తు వచ్చింది, ఐదు సార్లు మునిగితే ఇంకెంత వస్తుందో అని అత్యాశతో ఐదు సార్లు మునుగి లేచేసరికి ఉన్న రెండు వెంట్రుకలు కాస్తా ఊడిపోయి బోడిగుండైపోతుంది. ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న రాణిపై కోపంతో బురద పూస్తాడు చాకలి, చీమలు కసి తీర కుట్టి వదిలిపెడతాయి, గుర్రం సుబ్బరంగా కుమ్మి కుమ్మి పంపుతుంది. ఆ అవతారంతో ఊర్లోకి అడుగుపెట్టిన రాణిని చూసి ప్రజలందరూ పిచ్చిది అనుకుని ఊర్లోనుంచి తరిమేస్తారు. కథ కంచికి మనమింటికి.

16, జులై 2010, శుక్రవారం

ఓ బాటసారి నను మరువకోయి

మొదటి టపానే విషాదభరితమైన పాటతో మొదలుపెడుతున్నా..
కాని నేను బ్లాగ్ మొదలుపెట్టడానికి కారణమైన పాట ఇదే కాబట్టి, నేను వేరే పాటతో మొదలుపెట్టి దీనికి అన్యాయం చేయదల్చుకోలేదు..

ఈ పాట బాటసారి సినిమా లోనిది. క్లాస్ సినిమా కావడం మూలాన జనాలకు సరిగా రుచించక ఆ రోజుల్లో బాగా ఆడలేదట. కాని శరత్ బెంగాలీ నవల బడాదీదీ ఆధారంగా తీసిన ఈ సినిమా ఒక అద్భుతం, ప్రతీ పాట ఒక ఆణిముత్యమే.

చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన మాధవి పుట్టింట్లోనే తల్లి లేని చెల్లెలు ఆలనా పాలనా చూస్తూ, తండ్రిని, అన్నను కనిపెట్టుకుని ఉంటుంది. సురేంద్ర జమిందారు మనవడు. పుస్తకజ్ఞానమే తప్ప లోకజ్ఞానం బొత్తిగా తెలియని వాడు. లోకజ్ఞానం సంపాదించటానికి స్నేహితుల ప్రోద్బలంతో ఇల్లు విడిచి మద్రాసు చేరుకుంటాడు. అక్కడ మాధవి చెల్లెలికి చదువు చెప్పే పని మీద అతనికి ఆశ్రయం దొరుకుతుంది.
వేళకు తినాలి, నిద్రపోవాలి అని కూడా తెలుసుకోలేని అమాయకుడైన అతని అవసరాలను చూస్తూ అతనికేం కావాలో అది అమర్చుతూ ఉంటుంది మాధవి. ఒకసారి పని మీద మాధవి ఊరు వెళ్ళాల్సి రావడంతో అతని అవసరాలను చూసే దిక్కు లేక తనకక్కడ ఏమీ బాగాలేదని వెంటనే రావలసిందని ఉత్తరం రాయిస్తాడు. అప్పటికే అతని నిర్మలత్వాన్ని, అమాయకత్వాన్ని అభిమానించే మాధవి పరుగున ఇల్లు చేరుకోవడం, పని వాళ్ళ లేని పోని అపోహలకు దారి తీస్తుంది. అవి చెవిన పడడంతో ఆ కోపం సురేన్ మాధవి మీద చూపడం అతను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణమౌతుంది.

తన మాటలనే కాని మనసును అర్థం చేసుకోలేని సురేన్ వెళ్ళిపోతే మాధవి పడే తపనను సముద్రాల రాఘవాచార్యులు గారు అద్భుతంగా మాటలలో పెడితే భానుమతి గారు అత్యంత హృద్యంగా పాడి ఈ పాటకు జీవం పోసారు. ఏ.ఎం.రాజా గారు సంగీతం అందించిన ఈ సినిమాకు పి.రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు.

ఓ బాటసారి నను మరువకోయి
మజిలి ఎటైనా మనుమా సుఖాన

సమాజానికీ దైవానికీ బలియైతి నేను వెలియైతినే
వగే కాని నీపై పగ లేనిదాన
కడ మాటకైనా నే నోచుకోనా

శృతి చేసినావు ఈ మూగ వీణా
సుధా మాధురీ చవి చూపినావు
సదా మాసిపోని స్మృతే నాకు వీడి
మనోవీణ నీవు కొనిపోయెదోయి



ఈ సినిమా పాటలను చిమాటా మ్యూజిక్ ద్వారా వినవచ్చు
http://www.chimatamusic.com/telugu/searchnew.php?st=batasari&sa=Go!

అవకాశం చిక్కితే ఈ సినిమా తప్పక చూడండి. సమాజ కట్టుబాట్లకు, మనసులో రేగే సంఘర్షణకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా భానుమతి గారు చక్కగా నటించగా సరిగా చూడనైనా చూడకపోవడం చేత మాధవి పేరునే హృదయంలో ప్రతిష్ఠించుకుని మనసులో ప్రేమకు, కట్టుకున్న భార్యకు న్యాయం చెయ్యలేక నలిగిపోయేవాడిగా నాగేశ్వరరావు గారు జీవించారు

మొదటి టపా

ఇదే నా మొదటి టపా
ఎన్నో రోజులుగా అనుకుంటున్నఆలోచన ఈనాటికి కార్యరూపం దాల్చింది.
నాకు ఇష్టమైన పాటలను, సినిమాలను , నా భావాలను అందరితో పంచుకునే ప్రయత్నమిది.